కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెదక్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. పేదవాడి కష్టాలను పట్టించుకోకుండా, కేవలం అదానీ, అంబానీలు బాగుంటే చాలని మోదీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉపాధి హామీ పథకంపై కుట్ర
కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన చారిత్రాత్మక ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ‘అనంతపురం జిల్లా వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు ఈ పథకానికి అంకురార్పణ చేశారు. దేశంలోని కోట్లాది మంది పేదలకు ఇది జీవనాధారంగా మారింది. కానీ, నేడు ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా ఇవ్వాలని నిబంధనలు పెడుతూ, పరోక్షంగా పథకాన్ని ఎత్తేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వైఫల్యాలపై విమర్శలు
రాష్ట్రంలోని గత కేసీఆర్ ప్రభుత్వంపై కూడా మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు సంధించారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఆ భారం ఇప్పుడు ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కంటే స్వప్రయోజనాలకే గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు.
దేశంలో పేదలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా కేంద్రం తీరు ఉందని, ఉపాధి హామీ నిధుల్లో కోత విధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ALSO READ: Jana Sena Decision: ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం.. జనసేన కీలక నిర్ణయం, విచారణ మొదలైంది