తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రావడం అసాధ్యమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియా చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తనదైన విశ్లేషణను వినిపించారు.
రాష్ట్రంలో బీజేపీ అంతంత మాత్రమే..
పక్క రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీకి ఉన్నంత బలం తెలంగాణలో లేదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్ని గొడవలు చేసినా, ఎంతగా కోట్లాడినా ప్రజలు ఆ పార్టీని ఆదరించే స్థితిలో లేరన్నారు. తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు బీజేపీ సిద్ధాంతాలకు అనుకూలం కాదని, ఇక్కడ ఆ పార్టీ ఎప్పటికీ అధికారానికి ఆమడ దూరంలోనే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పతనం షురూ…
బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అందుకే కేటీఆర్ వంటి నాయకులు కేవలం సోషల్ మీడియాను పట్టుకొని పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్ఎస్ను విస్మరించారని.. కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడ బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదని, ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలపై స్పందిస్తూ.. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉందని ఆయన తెలిపారు. సరైన సమయంలో సమర్థులైన నాయకులను ఎంపిక చేస్తామన్నారు. అలాగే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో రాజకీయ సంస్థాగత మార్పులపై చర్చించామని అన్నారు. అయితే నైని కోల్ బ్లాక్ కేటాయింపులపై ఎటువంటి చర్చ జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.