ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి ప్రస్తుతం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం పంపిణీ వరకు ఎన్నో చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ సిద్ధాంతంతో తమ పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి కోసం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా దేవాదుల ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ప్రభుత్వం 600 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రతి జిల్లాకు మెడికల్ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తూ విద్యా వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు. ఒకప్పుడు తుపాకీ పట్టిన సీతక్క నేడు మంత్రిగా ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 200 కోట్లకు పైగా నిధులు వెచ్చించిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అగ్రనేతల తీరుపై మండిపడుతూ బావ బామ్మర్దులు ఒక దిక్కు చెల్లి మరో దిక్కు చేరి రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి పాలనకు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడమే నిదర్శనమని విమర్శించారు. మామ అల్లుళ్ల అవినీతి వల్లే కాళేశ్వరానికి ఈ గతి పట్టిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆ ఇంటి ఆడబిడ్డ స్వయంగా చెబుతోందని ఎద్దేవా చేశారు. గతంలో దొడ్డు బియ్యం అక్రమాలతో బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం కుర్చీ కోసం బావ బామ్మర్దుల మధ్య జరుగుతున్న పోరాటం అందరూ చూస్తున్నారని అన్నారు.
తెలంగాణలో బీజేపీకి చోటు లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో బీజేపీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను అంబానీ అదానీలకు కట్టబెట్టడమే కేంద్రం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఉదయం లేస్తే దేవుడి పేరు చెప్పి రాజకీయం చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల సర్వే నిర్వహించడం ద్వారా తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 53 శాతం టికెట్లు కేటాయించడం ద్వారా సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటిచెప్పారు. రాబోయే డిలిమిటేషన్ తర్వాత 100 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్