Jhansi Reddy: పాలకుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఎర్రబెల్లి ఝాన్సీ రెడ్డికి సొంత పార్టీ నుంచే నిరసన సెగలు తగులుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆమెకు వరుస షాకులను ఇస్తున్నాయి. గత రెండు విడతల ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె బలపరిచిన పలువురు అధికారిక అభ్యర్థులు ఓటమి పాలవగా, తాజాగా మూడో విడతలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన దేవరుప్పుల మేజర్ గ్రామపంచాయతీలో ఆమెకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇక్కడ ఝాన్సీ రెడ్డి తన ముఖ్య అనుచరుడైన జక్కుల గంగరాజును కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బరిలోకి దించారు. అయితే, స్థానిక కాంగ్రెస్ శ్రేణుల మద్దతు ఉన్న పెద్ది కృష్ణమూర్తి గౌడ్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఫలితాలు వెలువడ్డాక ఝాన్సీ రెడ్డికి షాక్ తగిలేలా.. ఆమె బలపరిచిన అభ్యర్థి గంగరాజు ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కృష్ణమూర్తికి, బీఆర్ఎస్ అభ్యర్థి సుందర్కు మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరికి 870 ఓట్ల భారీ మెజారిటీతో రెబల్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఘన విజయం సాధించారు.
గత రెండు విడతల్లోనూ పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఝాన్సీ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రెబల్స్ బరిలోకి దిగి విజయాలు సాధించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారనే అసంతృప్తి క్యాడర్లో ఉంది. దానికి నిదర్శనమే దేవరుప్పుల ఫలితం. ఝాన్సీ రెడ్డి అభ్యర్థి ఓడిపోయినప్పటికీ, గెలిచింది కాంగ్రెస్ రెబల్ కావడంతో దేవరుప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. ఒక టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఉండి, సొంత నియోజకవర్గంలో వరుసగా మూడు విడతల్లోనూ తన వర్గాన్ని గెలిపించుకోలేకపోవడం రాజకీయంగా ఆమెకు ఇబ్బందికర పరిణామమేనని విశ్లేషకులు అంటున్నారు.