తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రేషన్ ద్వారా సరఫరా చేసే బియ్యం నాణ్యతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలను రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (2026-27) నుండి అమలు చేయాల్సిన కొత్త నిబంధనల గురించి ఆయన దిశానిర్దేశం చేశారు.
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నాణ్యతలో ఇకపై ఎటువంటి రాజీ ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. సరఫరా చేసే బియ్యంలో గరిష్టంగా 10 శాతం కంటే ఎక్కువ నూకలు ఉండకూడదని తెలిపారు. అదేవిధంగా ఉడికించిన బియ్యంలో నూకల పరిమితిని కేవలం 5 శాతానికి పరిమితం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా మిల్లర్లు తమ మిల్లుల్లో ఆధునిక యంత్రాలను అమర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు మిల్లర్ల అసోసియేషన్ పూర్తిస్థాయిలో అంగీకారం తెలిపింది.
ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం సరఫరా చేసే బియ్యం విషయంలోనూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై వారికి ప్రత్యేకంగా నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయనున్నారు. అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద సుమారు 20,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ రైస్ను అందించేందుకు మిల్లర్లు ముందుకు వచ్చారు. తద్వారా విద్యార్థులకు మరింత రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందుబాటులోకి రానుంది.
ఈ సమావేశంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో బియ్యం నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలను పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు మేలైన ఆహార ధాన్యాలు అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని పౌరసరఫరాల శాఖ వివరించింది.
ALSO READ: Pending Bills: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. పెండింగ్ బిల్లులు విడుదల