తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేశారు. బిగ్ టీవీ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.
70 రోజులకు సరిపడా నిల్వలు..
రాష్ట్రంలో ఇంధన నిల్వలపై స్టీఫెన్ రవీంద్ర గణాంకాలను వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 70 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్ అందుబాటులో ఉంది. చమురు సంస్థలు నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాయి. నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం గమనిస్తోంది. ప్రజలు తమ రోజువారీ అవసరాలకు మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. భయాందోళనలతో బంకుల వద్ద రద్దీ పెంచడం వల్లనే తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అమ్మకాలపై నిరంతర నిఘా
కొన్ని పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు పెడుతున్న ఉదంతాలపై కమిషనర్ స్పందించారు. పౌరసరఫరాల శాఖ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా వాస్తవాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నప్పటికీ.. గతంలో కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రోజువారీ సగటు అమ్మకాల కంటే అధికంగా పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజలు భయాందోళనతో ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం వల్లే బంకుల్లో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. దీనిని కొరతగా భావించవద్దని ఆయన సూచించారు.
ధరలు పెరుగుతాయా..? ఇదిగో క్లారిటీ..
బెంగాల్ ఎన్నికల అనంతరం ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. ఈ కారణంగానే చాలామంది ముందుస్తుగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఈ భయమే ప్రస్తుత గందరగోళానికి ప్రధాన కారణం. గత వారం ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడం కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. పారిశ్రామిక అవసరాల కోసం డీజిల్ వాడేవారు.. నష్టాన్ని తగ్గించుకోవడానికి రిటైల్ బంకుల వద్ద భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల సాధారణ వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
సరిహద్దు జిల్లాల్లో పర్యవేక్షణ
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాల్లో పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఇంధన తరలింపు లేదా అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా ఉంచారు. పొరుగు రాష్ట్రాల ప్రభావం తెలంగాణపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరఫరా గొలుసులో ఎలాంటి అడ్డంకులు లేకుండా చమురు కంపెనీల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతున్నారు.
త్వరలోనే పరిష్కారం..
ప్రస్తుతం ఉన్న రద్దీ, గందరగోళం తాత్కాలికమేనని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి లోపు పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని.. వదంతులను నమ్మవద్దని కోరారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని.. ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేసిందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే బంకుల యజమానులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ALSO READ: డేకేర్ సెంటర్ లో దారుణం.. పసిపిల్లలను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి కిరాతకం!