సోషల్ మీడియా వేదికగా సాగుతున్న సరికొత్త దందాపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపనుంది. లక్కీ డ్రాల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు వార్నింగ్ ఇస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన ట్వీట్ చేశారు.
రీల్స్లో భారీ బిల్డప్.. రియాలిటీలో నిలువు దోపిడీ..! సోషల్ మీడియా పరపతిని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ఆగడాలపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్కీ డ్రా పేరుతో సామాన్యులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టించిన బ్యాచ్, ఇప్పుడు రూటు మార్చింది. ప్రభుత్వం బెట్టింగ్ ప్రకటనలపై నిఘా పెంచడంతో ఈ ‘సోషల్ మీడియా స్టార్స్’ ఇప్పుడు లక్కీ డ్రాల పేరుతో కొత్త దందా మొదలుపెట్టారు. కేవలం కొన్ని వందల రూపాయలకే కార్లు, బైకులు, ఖరీదైన ప్లాట్లు, డీజే సిస్టమ్స్ గెలుచుకోవచ్చంటూ ఆకర్షణీయమైన రీల్స్ చేస్తూ ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు.
ఈ తరహా కార్యకలాపాలు పూర్తిగా చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ‘ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బానింగ్) యాక్ట్-1978’ (The Prize Chits and Money Circulation Schemes (Banning) Act-1978) ప్రకారం ఇవి నేరపూరితమైనవి. అనుమతి లేకుండా లక్కీ డ్రాలు నిర్వహించడం, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం భారీ జరిమానాతో పాటు జైలు శిక్షకు దారితీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
‘మీకు లక్షల్లో ఫాలోవర్లు ఉండొచ్చు. మీరు పెద్ద సెలబ్రిటీలు కావచ్చు.. కానీ చట్టం ముందు అందరూ సమానమే’ అని పోలీసులు తేల్చి చెప్పారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని మోసపూరిత స్కీమ్లను ప్రమోట్ చేస్తే వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. అమాయక ప్రజలను దోచుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని.. ఇప్పటికే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ఖాతాలపై నిఘా పెట్టామని స్పష్టం చేశారు.
ప్రజలు ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోవద్దని అధికారులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదని.. తక్కువ ధరకే పెద్ద బహుమతులు వస్తాయన్న ఆశతో కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి లక్కీ డ్రాల పేరుతో మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.