Medchal: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ (ORR) అండర్బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 11:50 గంటల సమయంలో కొంపల్లి వైపు వెళ్లే మార్గంలో కండ్లకోయ ORR అండర్బ్రిడ్జి వద్ద TS08GU9850 నంబర్ గల పియాజియో ఏప్రిలియా ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సొహైల్ (18), సుమిత్ గైక్వాడ్ (17) తీవ్ర గాయాల పాలై ఘటన స్థలంలోనే మృతి చెందారు.
మృతుడు సొహైల్ దిల్కుష్నగర్లోని ఎస్. వి. మోడల్ హైస్కూల్ ప్రాంతానికి చెందిన వాడిగా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాగా, మరో మృతుడు సుమిత్ గైక్వాడ్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ప్రమాదానికి కారణమై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని, దీనిపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: భర్తను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం