Ujjaini Bonalu Rangam: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నగరంలో కన్నులపండువగా సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టం ‘రంగం’ (భవిష్యవాణి). రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 9.55 గంటలకు దేవాలయ ప్రాంగణంలో పచ్చికుండపై నిలబడి, అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ విశేషాలను వినేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి పోటెత్తారు.
ఉత్సవాలపై అమ్మవారి అసంతృప్తి
ఈ ఏడాది ఉత్సవాలు సంతృప్తికరంగా జరిగాయా అని ప్రధానార్చకులు ప్రశ్నించగా.. స్వర్ణలత కాసేపు మౌనంగా ఉండిపోయారు. అనంతరం ఆగ్రహంతో స్పందిస్తూ.. ‘నేను సంతోషంగా రాలేదురా బాలక, క్రోధంతో వచ్చాను’ అని పలికారు. ప్రతీ ఏటా భక్తులు చేసే పూజల పట్ల తాను కొంత అసంతృప్తితోనే ఉంటున్నానని, అయినా ఏ ప్రమాదం ముంచుకొచ్చినా తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని తెలిపారు. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మాట ఇచ్చి, కాలయాపన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
భారీ వర్షాలు, ప్రమాదాల హెచ్చరిక
నాటి సమాజంలో మారుతున్న మనుషుల ప్రవర్తనపై అమ్మవారు ఆవేదన వ్యక్తం చేశారు. జనం వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారని, తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలపై హెచ్చరిస్తూ.. ‘ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి, జనం కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయి. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి, ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయాల్సిందే!
తనపై ఎంత అహంకారం చూపించినా, ఉత్సవాల్లో నిరుత్సాహపరిచినా తన బిడ్డలను కాపాడుతూనే ఉంటానని చెబుతూ స్వర్ణలత కంటతడి పెట్టారు. భక్తులు కొండంత ఆశిస్తూ తనకు కనీస నైవేద్యం కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ‘రాబోయే 6 నెలల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే భారీగా ప్రాణనష్టం జరుగుతుంది, నా ఉగ్రరూపం చూడాల్సి వస్తుంది’ అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ రంగం కార్యక్రమం ముగిసిన అనంతరం, అమ్మవారిని అంబారీపై ఎక్కించి వైభవంగా నగర ఊరేగింపు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.