Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీని బ్రిటీష్ జనతా పార్టీ అని విమర్శించారు. ఈ విమర్శలకు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని “బ్రిటిష్ జనతా పార్టీ” అని పిలుస్తారని, కానీ కాంగ్రెస్ను బ్రిటిష్ పౌరుడు స్థాపించారన్న విషయం మర్చిపోయారన్నారు. ఇప్పుడు, INC – “ఇటలీ నేషనల్ కాంగ్రెస్” గా మారిందని విమర్శించారు. MGNREGA పేరు గురించి కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని, కానీ మహాత్మా గాంధీ నిజమైన ఆశయాలు ఎప్పుడు పట్టించుకోలేదన్నారు.
“స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ను రద్దు చేయాలని గాంధీజీ కోరుకున్నారు. కాంగ్రెస్ను పదే పదే ఓడిస్తూ.. ప్రజలు గాంధీజీ దార్శనికతను నెరవేరుస్తున్నారు. విభజించి పాలించు అని మాట్లాడే కాంగ్రెస్, ఓటు బ్యాంక్ కోసం భారతీయులను కులం, మతం పేరిట విభజించింది. బీజేపీ సంక్షేమ పథకాలు, గృహనిర్మాణం, రేషన్లు, గ్యాస్ సబ్సిడీ మతంతో సంబంధం లేకుండా పేదలకు చేరుతుంది. కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా పెంచి పోషించిన బానిస మనస్తత్వాన్ని బీజేపీ తొలగిస్తుంది. స్కిల్స్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సును చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నాను. అందులో మొదటి విద్యార్థి సీఎం రేవంత్ రెడ్డి అయి ఉండాలి. ఆయన స్కిల్స్ లో స్పష్టమైన తేదా ఉంది” -కేంద్రమంత్రి బండి సంజయ్
బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటీష్ జనతా పార్టీ అని చమత్కరించారు. ఆనాడు బ్రిటీషర్లతో ఎంత ప్రమాదం ఎదురైందో.. నేడు బీజేపీతో అంతే ప్రమాదం ఉందన్నారు. విభజించు, పాలించు, పేదలను అణగదొక్కు అని బ్రిటీషర్ల ఆలోచనతోనే ఇవాళ బీజేపీ దేశ ప్రజల్ని అణచివేస్తుందన్నారు. పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరు పేదల కోసం, యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తెస్తే ఆ పథకాన్ని రద్దు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Also Read: మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ అడగండి: సింగరేణి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామాల నుంచి వలసలు తగ్గాయని, గ్రామాల్లో కూలీలు తమ కూలీని తాము నిర్ణయించే శక్తి ఆ చట్టం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీలకు కూలీలు దొరకడం లేదని, ప్రజలు వలసలు పోవడంలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, మళ్లీ రైతులు, రైతు కూలీలు, గ్రామాలు వదిలి వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పట్టణాలకు వలస పోతే మళ్లీ వెట్టి చాకిరి వస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.