CM Revanth Reddy: తన రాజకీయ ప్రయాణం ఖమ్మం జిల్లా నుండే ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
2007లో ఎమ్మెల్సీగా ఉన్న సమయం నుండి నేడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఖమ్మం ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించారని, ఈ స్థాయికి ఎదగడానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని రేవంత్ రెడ్డి కొనియాడారు. “నాడు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీరిస్తే.. నేడు మా ప్రభుత్వం ‘సన్నబియ్యం’ పథకం ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది” అని చెప్పారు. రాష్ట్రంలోని 3.17 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.
ఉచిత విద్యుత్తుకు ఆద్యుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదని విమర్శిస్తూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇళ్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుంటూ.. “రాక్షస కుల గురువు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి పన్నాగాలు పన్నుతున్నాడు. ఆయన అనుచరులు అసెంబ్లీలో మారీచ, సుబాహులుగా మారి మాయలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అరాచకాలను బొందపెట్టడమే ఎన్టీఆర్ లాంటి నేతలకు ఇచ్చే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు.
సింగరేణి వ్యవహారంలో ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లను కేవలం అనుభవం ఉన్నవారికే ఇస్తామని, ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని భరోసా ఇచ్చారు. తమ రెండేళ్ల పాలనలో ఎక్కడా అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
భద్రాచలం అభివృద్ధిపై గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. కేసీఆర్ గతంలో రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని, కానీ తమ ప్రభుత్వ హయాంలో అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. అయోధ్యను తలపించేలా భద్రాచలాన్ని అద్భుతంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాల ద్వారా బీఆర్ఎస్ నేతలు బలపడేలా చేయవద్దని మీడియాకు సూచించారు.
మీడియా సంస్థల మధ్య ఏవైనా అంతర్గత గొడవలు ఉంటే అవి తమలో తాము చూసుకోవాలని, అనవసరంగా మంత్రులను బద్నాం చేయవద్దని హితవు పలికారు. మంత్రులపై వార్తలు రాసే ముందు తన వివరణ కోరాలని, తాను ఎప్పుడైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మంత్రిమండలిపై వచ్చే ఆరోపణలు తన గౌరవానికి భంగం కలిగిస్తాయని, మంత్రులమంతా సమన్వయంతో పనిచేస్తున్నామని వివరించారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.