మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మండలం గాగిల్లాపూర్ గ్రామ పరిధిలోని ఉస్మాన్ కుంట చెరువు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ గుప్పిట్లోకి వెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పిలుపు మేరకు చెరువుల అభివృద్ధి కోసం పలు నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా ప్రణీత్ డెవలపర్స్ సంస్థ ఉస్మాన్ కుంటను దత్తత తీసుకుంది. అయితే అభివృద్ధి పేరుతో ఈ సంస్థ చెరువును ఏకంగా తమ సొంత ఆస్తిగా మార్చుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ రికార్డుల్లో ఉస్మాన్ కుంటగా ఉన్న చెరువును సదరు సంస్థ తమ విల్లా ప్రాజెక్ట్ పేరు కలిసొచ్చేలా ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ ప్రైవేట్ లేక్గా మార్చేసింది. అయితే ఇది ప్రభుత్వ చెరువు అయినప్పటికీ.. చుట్టూ భారీ ప్రహరీ గోడ నిర్మించి సాధారణ ప్రజలకు ప్రవేశం లేకుండా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 8 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువులో దాదాపు రెండు ఎకరాల బఫర్ జోన్ స్థలాన్ని కబ్జా చేసి 8 విల్లాలు నిర్మించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడికి చెందిన సంస్థగా పేరున్న ప్రణీత్ డెవలపర్స్ , సర్వే నంబర్ 201 నుండి 208 పరిధిలో దాదాపు 70 ఎకరాల్లో 800 విల్లాలు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే చెరువు భూములను తమ ప్రాజెక్ట్లో కలిపేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ప్రాథమిక పరిశీలనలో బఫర్ జోన్ ఆక్రమణలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. FTL, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన విల్లాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ చెరువును దత్తత పేరుతో గేటెడ్ కమ్యూనిటీగా మార్చుకోవడం చట్టవిరుద్ధమని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆక్రమణలను తొలగించి, చెరువును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.