కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (VH) తన ఉదారతను చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమితులైన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి ద్వారా తనకు అందే పూర్తి జీతాన్ని పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించనున్నట్లు ప్రకటించారు. తన పదవీ కాలం ముగిసే వరకు వచ్చే ప్రతి రూపాయిని సొంత ట్రస్టుకు బదిలీ చేస్తానని వెల్లడించారు. రాజకీయాల్లో తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని.. కేవలం కష్టాన్నే నమ్ముకుని ఈ స్థాయికి ఎదిగానని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర మంత్రి హోదాతో కూడిన ఈ బాధ్యతలను ప్రభుత్వం ఇటీవల ఆయనకు అప్పగించింది. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీహెచ్కు నెలకు రూ. 1,00,000 వేతనం అందుతుంది. ఒకవేళ ప్రభుత్వ నివాసం కేటాయించకపోతే అదనంగా రూ. 50,000 ఇంటి అద్దె భత్యం పొందే అవకాశం ఉంది. సొంత వాహనాన్ని వినియోగిస్తే కన్వేయన్స్ అలవెన్స్ కింద రూ. 30,000 అలాగే ఇంధన ఖర్చుల కోసం రూ. 15,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. వీటితో పాటు డ్రైవర్తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. అఖిల భారత సర్వీసు అధికారులు మంత్రులకు లభించే వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా ఆయనకు వర్తిస్తుంది.
సలహాదారు కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఒక ప్రైవేట్ సెక్రటరీ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు ఒక డ్రైవర్ను నియమించారు. ఈ సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులను బీసీ సంక్షేమ శాఖ రెగ్యులర్ బడ్జెట్ నుంచి భరించనున్నారు. బీసీ వర్గాల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వానికి విలువైన సూచనలు అందించడంలో హనుమంతరావు రాజకీయ అనుభవం ఎంతగానో దోహదపడనుంది. పదవుల కంటే పేదల సేవకే ప్రాధాన్యత ఇస్తానన్న ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆదర్శవంతమైన నిర్ణయంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.
ALSO READ: వారెవ్వా.. ఇది కదా సక్సెస్ అంటే.. కొడుకుతో కలిసి టెన్త్ పాసైన అమ్మ!