West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ తల్లి, తన పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆరో తరగతిలోనే చదువుకు దూరమైనా, చదువుకోవాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకోవడమే కాకుండా, కొడుకుతో కలిసి పదో తరగతి పరీక్షల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
బండారు లక్ష్మీలహరి అనే మహిళ, కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్నప్పుడే చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ చదువుపై ఉన్న మక్కువ ఆమెను ఊరికే ఉండనివ్వలేదు. తన కుమారుడు విజయ్ పదో తరగతికి రావడంతో, తానూ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు. కొడుకు రెగ్యులర్ స్కూల్లో చదువుతుంటే, తల్లి ఓపెన్ స్కూల్ ద్వారా పుస్తకాలు పట్టింది. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూనే, కొడుకుతో పోటీపడుతూ రాత్రింబవళ్లు శ్రమించారు.
పరీక్షా ఫలితాలు వెలువడటంతో ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. కొడుకు విజయ్ 600 మార్కులకు గాను 562 సాధించి తన సత్తా చాటగా, తల్లి లక్ష్మీలహరి 500 మార్కులకు గాను 360 సాధించి సగర్వంగా పాసయ్యారు. ‘చదువుకోవడానికి వయసుతో పనిలేదని మా అమ్మ నిరూపించింది’ అని కొడుకు మురిసిపోతుంటే, ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించినందుకు తల్లి ఆనందానికి అవధుల్లేవు. పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని చాటిన ఈ తల్లిపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read: మొదట ఒక్కరితో.. ఆపై ముగ్గురితో.. భార్య సీక్రెట్ వీడియోలు చూసి తట్టుకోలేకపోయిన భర్త!