తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం అనంతరం వేం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. “తెలంగాణ ప్రజల సమస్యల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు హక్కుల గురించి పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వం తరపున గట్టిగా పోరాటం చేస్తాను” అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల సందడి నెలకొంది. తన ఆహ్వానం మేరకు ఢిల్లీకి తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు వెళ్లడం వల్ల, కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వానికి మరింత బలం చేకూరినట్లయింది. అభిషేక్ మను సింఘ్వీ వంటి జాతీయ స్థాయి నేతతో కలిసి ఆయన సభలో అడుగుపెట్టడం విశేషం.
Read Also: ప్రభుత్వ ప్రాథమిక స్థాయిలో మందుల్లేవ్.. సర్వేలో వెలుగులోకి సంచలనాలు..?