Veeresham: దేశాన్ని రాజకీయంగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న బీజేపీ కుట్రలను ఇండియా కూటమి సమర్థవంతంగా అడ్డుకుందని తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం పేర్కొన్నారు. ‘ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు’. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అందుకే ఆయన అన్ని రాష్ట్రాల సీఎంలను ఏకం చేస్తూ లేఖలు రాశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి ఉన్న శాస్త్రీయ దృక్పథం, విజన్ వల్లే ఈరోజు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయని ఆయన కొనియాడారు.
మహిళా బిల్లు – బీజేపీ ద్వంద్వ వైఖరి
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వీరేశం విమర్శించారు. 2023లో తెచ్చిన బిల్లును యథాతథంగా అమలు చేయాల్సింది పోయి, దానిని డీలిమిటేషన్తో ముడిపెట్టడం వెనుక రాజకీయ స్వార్థం దాగి ఉందన్నారు. ‘40 ఏళ్ల బీజేపీ చరిత్రలో ఒక్క మహిళను కూడా పార్టీ అధ్యక్షురాలిని చేయలేదు, పార్లమెంటరీ బోర్డులోనూ మహిళా ప్రాతినిధ్యం శూన్యం. అలాంటిది మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. కేవలం బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
మోదీకి కౌంట్డౌన్ మొదలైంది
ఆర్.ఆర్ (రేవంత్ రెడ్డి) జోడీ ముందు ప్రధాని మోదీ ఎత్తుగడలు సాగవని, బీజేపీ పతనం ప్రారంభమైందని ఆయన జోస్యం చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను బానిసత్వంలోకి నెట్టాలని చూసే ఏ ప్రయత్నాన్ని అయినా కాంగ్రెస్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి స్ఫూర్తితో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని, బీజేపీకి చరమగీతం పాడే వరకు ఈ పోరాటం ఆగదని వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ, మణిపూర్ లాంటి చోట్ల వారి భద్రతను విస్మరించిన బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read: స్టేట్ టాపర్.. అవినీతిలో నంబర్ 1.. ఆరు నెలలకే ఏసీబీకి దొరికిపోయిన యువ అధికారిణి!