Konda Surekha: అభివృద్ధి చేసే వారికే ఓటు వేయండని అది కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. ఆదివారం డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడారు. గత పాలకులు ప్రజా శ్రేయస్సు మరిచారని, రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ప్రజలందరికీ ఆశ చూపి వారి ఆశలను అడియాశలు చేశారని ఆరోపించారు. కొన్నిచోట్ల తూతూ మంత్రంగా నిర్మించి గాలికే వదిలేశారని విమర్శించారు. రూ. కోట్లు కొల్లగొట్టడమే పరమావధిగా పరిపాలన చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పారు.
నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా రంజక పాలన చేస్తున్నారని కొనియాడారు. పేదలకు రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుపేదలకు ఉచిత విద్యుత్, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, సన్నధాన్యానికి బోనస్ అందిస్తూ రైతుల పక్షపాతిగా సీఎం నిలిచారని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ రైతునే ఉంటారని ఇటీవలనే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రుజువైందన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లోను ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు పెరిగాయి. జిల్లాలతో పాటు మున్సిపాలిటీలు సైతం పెరిగాయి. కానీ గత ప్రభుత్వంలో జిల్లాలు కానీ, మునిసిపాలిటీలు కానీ అభివృద్ధి చెందలేదని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మునిసిపాలిటీలను అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో వ్యవహరించి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను ఎన్నుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రెటరీలు, మంత్రివర్గ సభ్యుల సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక సజావుగా జరుగుతుందన్నారు. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే నాయకుల మధ్య సమన్వయం చేస్తామని, అధినాయకత్వానికి వివరిస్తామన్నారు. ప్రజా పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా ఆర్టిఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, అనుబంధ సంఘ అధ్యక్షులు కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ గౌస్, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్ గౌడ్, జెర్రిపోతుల అంజనీ కుమార్, ముల్లపాటి సీతారాములు, రంగా జనార్ధన్, ఏలూరి రవికుమార్, గజ్జి సూర్యనారాయణ, బచ్చలకూరి నాగరాజు, బెజ్జం గంగాధర్, కిరణ్ పాల్గొన్నారు.
Also Read:Konda Surekha: మమ్మల్ని ఎదుర్కోలేక మా వెనుక గోతులు.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్