Weather Updates: రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. హాఫ్ సెంచరీ దిశగా భానుడు పయనిస్తున్నాడు. ఇవాళ రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదైన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం నాలుగైదు వరకు కూడా ఎండ వేడిమి తగ్గటం లేదు. రాత్రి సమయాల్లో తీవ్రమైన ఉక్కపోత. ఇటు ఎండ వేడి.. అటు ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.
ఇటు రాజధాని నగరంలో ఎండ వేడికి ప్రజలు బయటకు రావాలంటే భయపడ్తున్నారు. 45.6°C ఉష్ణోగ్రతతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక నల్గొండ, రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో కూడా భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు.
అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.2 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నిడమనూరులో 45.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూరు 45.1 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంక 45.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 45 డిగ్రీలు, గ్రేటర్ పరిధిలో అత్యధికంగా హఫీజ్పేట్లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయని పేర్కొంది.
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వానలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ.. మరోవైపు మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది.