మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీకి ఊహించని విధంగా దారుణమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఒక్క మున్సిపాలిటీల్లోనూ బీజేపీ సత్తా చాటలేకపోయింది. కేవలం 250కు పైగా వార్డుల్లో మాత్రమే బీజేపీ గెలవగా..పలు మున్సిపాలిటీల్లో ఇంకా ఓటింగ్ కొనసాగుతోంది. నేటి రాత్రి వరకు పూర్తి ఫలితాలు వెలువడే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలమైన పట్టు ఉన్నది.గత అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో 8+8 స్థానాలు సాధించిన బీజేపీకి మున్సిపల్ ఎన్నికలు నిజంగానే షాక్ ఇచ్చాయని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇలాంటి ఫలితాలు వస్తాయని కమలం పార్టీ సైతం ఊహించి ఉండదని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని అంతా భావించారు.కానీ,అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో కేడర్ సైతం షాక్ లో ఉన్నట్టు సమాచారం.
గత సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయ్యింది. గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలను కమలం పార్టీ రాబట్టింది. అయితే, పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉన్నది. కానీ, ఈసారి ఊహించని విధంగా పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీకి పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి కారణం పార్టీ నేతల వైఫల్యమే అని తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం నుంచి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తోంది. దీనికి తోడు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసినట్టుగా పోల్ మేనేజ్మెంట్ బీజేపీ సరిగా చేయలేదని సైతం వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కమున్సిపాలిటీని సైతం బీజేపీ గెలవకపోవడంతో రానున్న ఎన్నికల్లో గెలుపుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదని సైతం చర్చ జరుగుతోంది.
తాజా మున్సిపల్ ఎన్నికల్లో కేవలం కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్లో బీజేపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే బీఆర్ఎస్ లేదా స్వతంత్రుల సాయం తప్పక తీసుకోవాల్సిన పరిస్థితిలో బీజేపీ ఉన్నది. రెండు కార్పొరేషన్లలో విజయం సాధించడం పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తనకు ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.తమకు మద్దతు ఇవ్వడానికి స్వతంత్రులు సిద్దంగా ఉన్నారని వివరించారు. ఏదేమైనా కార్పొరేషన్లలో విజయం బీజేపీకి కాస్త ఊరట కలిగించినా 116 మున్సిపాలిటీల్లో ఒక్కటి కూడా సాధించకపోవడంతో జిల్లాల్లో ఆ పార్టీకి ఆదరణ తగ్గినట్టుగానే చెప్పవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఇలా అయితే వచ్చే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి రావడం కల్లే అవుతుందని టాక్ వినిపిస్తోంది.
బీజేపీలో నాయకత్వలేమి, అంతర్గత కుమ్ములాటల వల్లే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటలేకపోయిందని చర్చ జరుగుతున్నది. ఎందుకంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సన్నిహితుడైన రాంచందర్ రావు స్టేట్ చీఫ్ అయినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఇదే విషయంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. కేంద్రం నిర్ణయంతో విభేదించి పార్టీ సభ్వత్యానికి రాజీనామా చేశారు. దీనికి తోడు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం తనకు పార్టీ చీఫ్ పోస్టు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కానీ రాకపోవడంతో ఆయన సైతం కొంత నిరాశకు లోనైనట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి తోడు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సరిగాలేదని.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందని.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయకపోవడం వల్లే బీజేపీకి ఇలాంటి ఫలితాలు వచ్చాయని పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఇలాంటి పనితీరుతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.