WhatsApp MeeSeva: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ మీసేవ (WhatsApp MeeSeva) విధానం ద్వారా ఇప్పటి వరకు 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు అందుకున్నారు. 4.5 లక్షల మంది వివిధ పౌర సేవలకు వాట్సాప్ మీసేవలో నమోదు చేసుకోగా.. వీరిలో 3.25 లక్షల మంది సేవలను పొందారు. మీ సేవా ( MeeSeva) కేంద్రాల ఎదుట క్యూ కట్టే పనిలేకుండా ప్రజా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాట్సాప్ మీసేవ విధానం తక్కువ కాలంలోనే రాష్ట్ర ప్రజలకు చేరువైంది. రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ మీసేవా 8096958096 అనే వాట్సాప్ నంబర్ ద్వారా నిర్విరామంగా 24 గంటల పాటు పౌర సేవలు పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
వాట్సాప్ మీసేవ (MeeSeva) నుంచి మొత్తం పదికి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 వివిధ రకాల సేవలు రాష్ట్ర ప్రజలు పొందే అవకాశం కల్పించింది.ప్రధానంగా కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు పొందటం చాలా సులువైంది. ఎక్కువ మంది ఆదాయ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, రెసిడెన్సీ సర్టిఫికెట్, పోలీస్ చలాన్, రెన్యువల్ ఆఫ్ రేషన్ షాప్స్, టెంపుల్ సర్వీసెస్, బిల్డింగ్ పర్మిషన్, వెహికిల్ లైఫ్ ట్యాక్స్, లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ సేవలు వాట్సాప్ లోనే పొందొచ్చు. మీ-సేవ సర్టిఫికెట్ల స్టేటస్, తాజా అప్ డేట్స్ కూడా వాట్సాప్లోనే తెలుసుకోవటం, ఆమోదం పొందిన సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండటంతో పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గింది.
18 నవంబరు 2025 న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ వాట్సాప్ మీసేవ (MeeSeva)సర్వీసును ప్రారంభించారు. వాట్సాప్ సేవలతో ఆశించిన మేరకు పౌర సేవలు వేగం పుంజుకోవటంతో పాటు దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరింత చేరువైంది. దరఖాస్తుదారులు ప్రశ్నలు అడగడానికి, సేవలకు దరఖాస్తు చేసుకోవడానికి, చెల్లింపులు చేయడానికి లేదా వారి దరఖాస్తుల స్థితిని తనిఖీ చేయడానికి మెస్సేజ్ ను పంపి పరిశీలించవచ్చు. సంబంధిత సేవను నేరుగా పొందవచ్చు.ఈ సంభాషణ దరఖాస్తుదారుడికి సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తుంది. డిజిటల్ టెక్నాలజీపై అవగాహన లేని దరఖాస్తుదారులకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ విధానం.వాట్సాప్ మీసేవ ద్వారా రాష్ట్రంలో 31 దేవాలయాలకు సంబంధించిన సేవలను అందజేస్తుంది. భక్తులు దర్శనం, వసతి తదితర సేవలు ఇందులోనే బుక్ చేసుకోవచ్చు.
రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సేవలను కూడా వాట్సాప్ మీసేవ ద్వారా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 108, 102, అగ్నిమాపక సేవలకు 101, ఎస్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్, ముఖ్యమైన హెల్ప్ లైన్ నెంబర్లన్నీ దీనికి లింక్ చేస్తారు.వాట్సాప్ మీసేవతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా మీసేవా కేంద్రాలు ప్రతిరోజూ 80 వేల మంది నుంచి లక్ష మందికి డిజిటల్ పౌర సేవలు అందిస్తున్నాయి. 2023 నవంబర్1 నుంచి 2026 జనవరి 31 వరకు, మీసేవ ద్వారా 5.98 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ. 3,811 కోట్లు. మీ సేవ కేంద్రాలు, వాట్సాప్ మీసేవా విధానం ద్వారా అనవసరమైన మధ్యవర్తుల పాత్ర తొలిగిపోయి.. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గింది. సేవల్లో పారదర్శకత మెరుగుపడింది. పౌర సేవల పరిష్కారం వేగవంతమైంది.
Also Read: Telangana Municipal Elections: పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు.. తెర వెనుక ఏం జరిగింది?