Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనాన్ని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారం రద్దయింది. తొలుత అనుకున్న ప్రకారం శని, ఆదివారాల్లో తెలంగాణలో పవన్ ప్రచారం ఉండాల్సింది. కానీ చివరి నిమిషంలో రద్దయింది. పవన్ కు అనారోగ్యం వల్ల రాలేకపోతున్నారని పైకి చెబుతున్నా వాస్తవానికి దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని జనసేనాని (Pawan Kalyan) పవన్ కల్యాణ్ ను స్వయంగా ఆయన ఇంటికే వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఇటీవల మద్దతు కోరారు. కానీ ప్రధానంగా పార్టీ ఎంపీలు, శ్రేణుల నుంచి వచ్చిన అంతర్గత ఒత్తిడి వల్ల కాషాయ పార్టీ ఎట్టకేలకు బ్యాక్ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో కమలం పార్టీ అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. అలాగే జనసేన 336 వార్డుల్లో పోటీచేస్తోంది. వారికి బీ ఫామ్ లు అందించగా రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను సైతం ఆమోదించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. కాషాయ పార్టీలో టికెట్ దక్కని పలువురు జనసేనలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ అంశం బీజేపీ ఎంపీలకు ఏమాత్రం మింగుడుపడటంలేదని తెలుస్తోంది. ఎందుకంటే అదే స్థానంలో పవన్ ప్రచారానికి వెళ్తే ఆయన జనసేన అభ్యర్థిని గెలిపించాలని కోరుతారా? లేక బీజేపీ అభ్యర్థినా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గందరగోళం ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో పలువురు ఎంపీలు రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఒక ఎంపీ అయితే పవన్ ను ఎట్లా తీసుకొస్తారని, ఆయన ఎలా వస్తారని రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు టాక్. ఎట్టకేలకు ఎంపీల పట్టుతో కాషాయ పార్టీ స్టేట్ యూనిట్ వెనుకడుగు వేసినట్లు సమాచారం.
సొంత బలం ఉన్న చోట పవన్ను రంగంలోకి దించడం వల్ల పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ముఖ్యంగా గతంలో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రత్యర్థులు అస్త్రాలుగా మలచుకుంటున్నారని ఎంపీలు స్టేట్ పార్టీ వద్ద లేవనెత్తినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ను ప్రచారానికి ఆహ్వానించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని భావించిన కొందరు నాయకులు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెంచడంతో అంతర్గత కుమ్ములాటలు, క్షేత్రస్థాయి సమీకరణాల దృష్ట్యా పవన్ ప్రచారంపై బీజేపీ నాయకత్వం బ్యాక్ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయందుందుభి మోగించిన జనసేన, తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వార్మప్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పవన్ పార్టీ భావించింది. కానీ రాజకీయ ఒత్తిడి కారణంగా ప్రచారం రద్దయింది. ఈ రద్దు పరిణామం జనసేన అభ్యర్థులకు మైనస్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే సొంత పార్టీ తరుపున పోటీ చేసినా వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉండటం గమనార్హం.