Jagtial Crime News: జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో గర్భవతి అయిన యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త హరిబాబుతో పాటు, అతనికి సహకరించిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కులాంతర వివాహం, అదనపు కట్నం వేధింపులే ఈ ఘోర హత్యకు ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20), చిత్తారి హరిబాబు సోషల్ మీడియా ద్వారా పరిచయమై ప్రేమించుకున్నారు. వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో హరిబాబు తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైష్ణవి ఇంట్లోనే కాపురం ఉండేవారు. ప్రస్తుతం వైష్ణవి నాలుగు నెలల గర్భవతి. అయితే, గత కొంతకాలంగా హరిబాబు కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అదనపు కట్నం తీసుకురావాలంటూ హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు.
కట్నం వేధింపులు భరించలేకపోయిన తరుణంలో, హరిబాబు తన భార్య వైష్ణవిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరిబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు, లోతైన దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ హత్యకు హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, అన్నలు చిత్తారి ఆనంద్, చిత్తారి అశోక్ కూడా సహకరించినట్లు.. వైష్ణవిని హత్య చేసేలా ప్రేరేపించినట్లు ఆధారాలు లభించాయి. దీంతో మెట్పల్లి డిఎస్పి ఏ. రాములు ఆదేశాల మేరకు ఎస్సై చిరంజీవి నిందితులందరినీ అరెస్ట్ చేశారు.
నిందితులు ముగ్గురిని గురువారం (మార్చి 19) అరెస్ట్ చేసి డిఎస్పి ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కట్న వేధింపులు, హత్యకు ప్రేరేపించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఒక నిండు ప్రాణాన్ని, పుట్టబోయే బిడ్డను బలి తీసుకున్న ఈ ఘటన జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డిఎస్పి రాములు స్పష్టం చేశారు.
Read Also: Student Suicide: మీర్పేట్లో విషాదం.. పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థిని సూసైడ్