మధ్యప్రదేశ్లోని ఓ కలుషిత నదిని శుభ్రం చేయాలనే సంకల్పంతో ఒంటరిగా మొదలుపెట్టిన ఓ యువకుడి ప్రయత్నం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అధికారులు వస్తారని ఎదురుచూడకుండా తనే రంగంలోకి దిగి నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. సోషల్ మీడియాలో ‘బిట్టు తబాహి’ పేరుతో గుర్తింపు పొందిన ఆయనకు ‘ది ఓషన్ క్లీనప్’ వ్యవస్థాపకుడు, సీఈఓ బోయన్ స్లాట్ నుంచి ఉద్యోగ ఆహ్వానం రావడం ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆహ్వానం
సురేంద్ర చేస్తున్న నదీ శుభ్రత కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన బోయన్ స్లాట్ స్పందించారు. ఓ పోస్ట్ కు రిప్లై ఇస్తూ.. “మా కోసం పని చెయ్యి @Surendr75950620” కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఒక చిన్న ప్రాంతంలో ప్రారంభమైన ప్రయత్నం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడంతో సురేంద్ర పేరు ఇప్పుడు మరింతగా వినిపిస్తోంది.
Come work for us @Surendr75950620
— Boyan Slat (@BoyanSlat) September 4, 2026
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బియోరాకు చెందిన సురేంద్ర ప్రస్తుతం బీఎస్సీ చదువుతున్నారు. అజ్నార్ నది తీవ్రంగా కలుషితమై ఉండటాన్ని చూసి ఈ ఏడాది జనవరి 26 నుంచి నదిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. నదిలో ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్త, నాచు, పాడైపోయిన వస్తువులతో పేరుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లో చెత్త పొరల కారణంగా నీటి ప్రవాహం కూడా సరిగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిని చూసిన సురేంద్ర యంత్రాలు, భారీ పరికరాలు లేకుండానే స్వయంగా నదిలోకి దిగి చెత్తను తొలగించడం ప్రారంభించారు.
సురేంద్రకు మొదట్లో పెద్దగా వనరులు అందుబాటులో లేవు. అతనితో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవసరమైన శుభ్రత పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు నది పరిసరాల్లో చెత్త వేయకుండా ఉండేందుకు డస్ట్ బిన్లను ఏర్పాటు చేయడానికి సొంత డబ్బును ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం కోసం సురేంద్ర దాదాపు రూ.30 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
నదిని శుభ్రం చేస్తున్న సమయంలో సురేంద్రకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు స్థానికులు ఆయనను ఎగతాళి చేశారు. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడం కోసమే ఈ పని చేస్తున్నాడంటూ విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు.. కలుషిత నీటిలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల ఆయనకు చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సురేంద్ర తన ప్రయత్నాన్ని ఆపలేదు.
2013లో ప్రారంభమైన ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. అలాంటి సంస్థ అధినేత నుంచి సురేంద్రకు వచ్చిన ఆహ్వానం.. అతని కృషికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా చెప్పొచ్చు. ఒక యువకుడు తన పరిసరాల్లోని సమస్యను చూసి బాధ్యత తీసుకుంటే ఎలాంటి మార్పు తీసుకురాగలడో సురేంద్ర మరోసారి చూపించాడు. అధికారులు, ఇతరుల కోసం ఎదురుచూడకుండా తానే ముందడుగు వేసిన ఈ యువకుడి ప్రయత్నం ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
Read Also: ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీస్ ఇవే!