Mizoram Railway Update: ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అస్సాం–మిజోరం మధ్య కీలకమైన రైల్వే మార్గం పలు చోట్ల మట్టి కోతకు గురైంది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రిపేర్ చేసేందుకు రైల్వే అధికారులు పనులు ప్రారంభించారు. త్వరలోనే పనులు పూర్తి కానున్నట్లు వెల్లడించారు.
కటఖల్–బైరబి రైల్వే సెక్షన్ లోని జమీరా–బైరబి మార్గంలో భారీ వర్షాల ప్రభావంతో మట్టి కోత ఏర్పడింది. సుమారు 70 మీటర్ల మేర రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ మధ్య భాగం నుంచి సుమారు 40 మీటర్ల వరకు మట్టి కోత ప్రభావం కనిపించినట్లు చెప్పారు. ఈ ఘటనతో మిజోరంకు రైలు కనెక్టివిటీకి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ప్రభావిత ప్రాంతాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
దెబ్బతిన్న ప్రాంతానికి నేరుగా రోడ్డు మార్గం లేకపోవడం పునరుద్ధరణ పనులకు పెద్ద సమస్యగా మారింది. అవసరమైన సామగ్రి, యంత్రాలను అక్కడికి తరలించడం కూడా కష్టంగా మారింది. దీంతో సాధారణ పరిస్థితులతో పోలిస్తే మరమ్మతు పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. పరిస్థితులను బట్టి రైలు సేవలను దశలవారీగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు NFR చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు. ట్రాక్ పూర్తిగా సేఫ్ గా మారే వరకు కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు.
రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారు. 15610 సైరంగ్–గౌహతి ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 5, 7, 9 తేదీల్లో రద్దయింది. 15609 గౌహతి–సైరంగ్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 6, 8 తేదీల్లో రద్దు చేశారు. అలాగే 55667 సిల్చార్–బైరబి ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు, 55668 బైరబి–సిల్చార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు రద్దయ్యాయి. 55669 సిల్చార్–సైరంగ్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు, 55670 సైరంగ్–సిల్చార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 6, 8, 9, 10 తేదీల్లో రద్దు చేశారు.
కొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేయకుండా హైలాకండి వరకు పరిమితం చేశారు. 15610 సైరంగ్–గౌహతి ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 6, 8 తేదీల్లో సైరంగ్కు బదులుగా హైలాకండి నుంచి బయలుదేరుతుంది. 13126 సైరంగ్–కోల్కతా ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 7న హైలాకండి నుంచే ప్రారంభమవుతుంది. అదే విధంగా 15609 గౌహతి–సైరంగ్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 5, 7, 9 తేదీల్లో సైరంగ్కు బదులుగా హైలాకండిలోనే ముగుస్తుంది. 13125 కోల్కతా–సైరంగ్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 5న, 20508 ఆనంద్ విహార్ టెర్మినల్–సైరంగ్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 6న హైలాకండిలో ముగియనున్నాయి. రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు రైళ్ల తాజా రన్నింగ్ స్టేటస్ ను ముందుగా తెలుసుకోవాలని అధికారులు తెలిపారు.
Read Also: వర్షాల దెబ్బకు కుంగిన రైల్వే ట్రాక్.. ఏకంగా 14 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు!