Vizag Adventure: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మకుటంగా నిలిచే విశాఖపట్నం ఇప్పుడు టూరిస్టులకు సరికొత్త సాహస అనుభూతులను పంచడానికి సిద్ధమవుతోంది. పచ్చని కొండలు, అనంతమైన నీలి సముద్రం కలయికతో అలరించే ఈ నగరంలో అడ్రినాలిన్ రష్ ఇచ్చే పారా మోటార్ విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు విశాఖ ఇప్పుడు ఒక పర్పెక్ట్ డెస్టినేషన్గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతోంది.
రుషికొండ తీరంలో గగన విహారం
విశాఖలోని అత్యంత అందమైన బీచ్లలో ఒకటైన రుషికొండ బీచ్లో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ సోమవారం(మార్చి 16) నుండి ప్రారంభం కానున్నాయి . సాధారణ పారా గైడింగ్కు భిన్నంగా దానికి ఒక చిన్న ఇంజన్, ప్రొపెల్లర్ అమర్చి ఉంటుంది. దీనివల్ల మనం గాలిలో ఎగిరే అవకాశం ఉంటుంది. సుమారు 5 కిలోమీటర్ల మేర సముద్రపు అలల పై నుండి గాలిలో ప్రయాణిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేము.
అప్పుడప్పుడూ గాలిలో ఎగిరే పక్షులను చూస్తున్నప్పుడు మనం కూడా పక్షులం అయితే ఎంతో బాగున్న అని మనలో చాలా మంది అనుకునే ఉంటారు. అలా ఇప్పుడు పక్షిలా ఆకాశంలో విహరిస్తూ కింద కనిపిస్తున్న బంగాళాఖాతపు నీలి రంగును, తీరం వెంబడి ఉన్న కొండలను చూడటం పర్యాటకులకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
టికెట్ ధరలు, సమయాలు
ప్రస్తుతం ఇక్కడ 4 పారా మోటార్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. ఒక వ్యక్తి ప్రయాణానికి టికెట్ ధరను రూ. 3 వేలుగా నిర్ణయించారు. పారా మోటార్ విన్యాసాలు ఉదయం 9 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు పర్యాటకులు ఈ సాహస క్రీడను ఆస్వాదించవచ్చు. అదే విధంగా భద్రత విషయంలో నిర్వాహకులు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. అనుభవం ఉన్న పైలట్లు, ఆధునిక భద్రతా గేర్ల పర్యవేక్షణలో ఈ సాహస విన్యాసాలు జరుగుతాయి కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఎంజాయ్ చేయవచ్చు.
కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్.. ఆకాశంలో నడక
విశాఖ పర్యాటకంలో మరో కీలకమైనది కైలాస గిరి గ్లాస్ బ్రిడ్జ్. ఎత్తైన కొండపై నుండి నగరాన్ని, సముద్రాన్ని ఆస్వాదించేందుకు కైలాస గిరిలో ఈ అద్దాల వంతెనను పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సుమారు రూ.7 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన దేశంలోని ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాలలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్లకు ఏమాత్రం తీసిపోదు. దీని పైన నడుస్తున్నప్పుడు కింద ఉన్న లోతైన ప్రాంతాలు కినిపిస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఎట్ ద సేమ్ టైం అంతే ఉత్సాహాన్నిస్తుంది.
సేప్టీ విషయానికి వస్తే మాత్రం ఈ వంతెన అత్యంత పటిష్టమైనది. దీని తయారీలో ఏకంగా 40 mm మందమున్న లామినేటెడ్ గ్లాస్ను ఉపయోగించారు. ఇది వందల కిలోల బరువును సునాయాసంగా తట్టుకోగలదు. ఒకే సమయంలో 40 మంది పర్యాటకులు ఈ వంతెనపై నడిచే విధంగా దీని సామర్థ్యాన్ని రూపొందించారు. గ్లాస్ బ్రిడ్జ్ పై నుండి ఫోటోలు దిగడం ఇప్పుడు టూరిస్టులకు ఒక క్రేజ్గా మారింది.
మీరు కుటుంబంతో కలిసి గాని, స్నేహితులతో కలిసి గాని ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే.. విశాఖపట్నం అందాలు చూడనికి ఒక్కసారైన వెళ్ళండి. అక్కడ రుషికొండలో గగన విహారం, కైలాసగిరి అద్దాల వంతెనపై నడవడం వంటివి మీ ట్రిప్లో మరిచిపోలేని అనుభవాలను క్రియేట్ చేస్తుంది. ఈ వీకెండ్లో లేదా రాబోయే సెలవుల్లో విశాఖ అందాలను ఈ సాహస కోణంలో చూడటం మర్చిపోకండి!
Also Read: తక్కువ బడ్జెట్లో భూలోక స్వర్గానికి చెక్కేయండి.. వేసవిలో బెస్ట్ ప్లేస్ ఎర్కాడ్