మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా వందలాది విమానాలు రద్దు అయ్యాయి. ఆదివారం నాడు మిడిల్ ఈస్ట్ కు వెళ్లు సుమారు 444 విమానాలను రద్దు చేసినట్లు కేంద్ర విమానయానశాఖ ప్రకటించింది. ఇరాన్ సహా పలు దేశాల్లో గగనతలం మీద పరిమితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇరాన్ యుద్ధం కారణంగా వేలాది ప్రయాణీలకు మీద ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులను తొలగించేందుకు కీలక చర్యలు చేపట్టాయి. కొన్ని విమాన సంస్థలు ప్రయాణీకులకు ఉచితంగా రీషెడ్యూల్ అవకాశాన్ని కల్పిస్తే, మరికొన్ని విమాన సంస్థలు పూర్తి రీఫండ్ చేసేందుకు ముందుకొచ్చాయి.
గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా రీషెడ్యూల్ ను అందించనున్నట్లు ప్రకటించింది. లేదంటే, పూర్తి రీఫండ్ అందిస్తామని ప్రకటించింది. మార్చి 5, 2026 వరకు ప్లాన్ చేసిన ప్రయాణానికి ఫిబ్రవరి 28, అంతకు ముందు బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపింది. ప్రయాణీకులు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. లేదంటే వారి చెల్లింపును వాపసు తీసుకోవచ్చని వెల్లడించింది. ఎయిర్ ఇండియా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, ప్రయాణీకులు, సిబ్బంది భద్రత లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో వివరాలను తనిఖీ చేయాలని, లేదంటే ఎయిర్ లైన్ 24/7 కస్టమర్ సపోర్ట్ ను కాంటాక్ట్ కావాలని సూచించింది.
అటు ఇండిగో ఎయిర్లైన్స్ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి రీఫండ్ అందించనున్నట్లు ప్రకటించింది. 28 ఫిబ్రవరి, అంతకు ముందు చేసిన బుకింగ్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పూర్తి వాపసు, లేదంటే రీషెడ్యూల్ను 7 మార్చి 2026 వరకు ఎంచుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. “ఫిబ్రవరి 28, అంతకు ముందు చేసిన బుకింగ్లకు మార్చి 7 వరకు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు లేకుండా పూర్తి వాపసును తీసుకోవచ్చు” అని ప్రకటించింది.
అటు యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ విమాన సంస్థలు విమాన సర్వీసుల రద్దును పొడిగించాయి. ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్ వేస్ విమానాల సస్పెన్షన్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్ నుంచి ప్రతీకార దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్ వేస్ తో సహా గల్ఫ్ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాల సస్పెన్షన్ను పొడిగించాయని బ్లూమ్ బెర్గ్ ప్రకటించింది.
Read Also: గల్ఫ్ లో యుద్ధ కల్లోలం.. ఆకాశంలోకి ఎగరని విమానాలు!