Hyderabad: స్వేచ్ఛ బ్యూరో: మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. క్రీడా రంగంలో దేశంలోనే అత్యంత చురుకైన నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ హాకీ(ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ను అత్యున్నతా ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఈ పోటీలు ఈ నెల 8 నుంచి 14 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ క్వాలిఫయర్స్లో మొత్తం 8 దేశాలు భారత్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్డ్ కప్కు అర్హత సాధించేందుకు కీలక పాత్ర పోషించనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ఆస్ట్రో టర్ఫ్, ఆధునిక సదుపాయాలు, అత్యున్నత భద్రతా ఏర్పాట్లు, క్రీడాకారులు, అధికారుల కోసం ప్రీమియం వసతి కల్పించనున్నారు.
Also Read: Suicide Attempt: ర్యాగింగ్ భయంతో.. ఐరన్ మాత్రలు మింగిన 8వ తరగతి బాలిక
భారత జట్టు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ , ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నాయి. అన్ని జట్లకు అంతర్జాతీయ ప్రమాణాల వసతి, ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ టోర్నమెంట్ సందర్భంగా నగరానికి విచ్చేసే క్రీడాకారులు మరియు అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటనలు, వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత వలన తెలంగాణలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 నిర్వహణతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోనుంది.అన్ని జట్లు, అధికారులు, అభిమానులను తెలంగాణ ప్రభుత్వం హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది.
Also Read: Temple Land Survey: ఆలయ భూముల కబ్జాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..?