Kazipet Rail Manufacturing Hub: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాజీపేట రైలు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టుతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రారంభ దశలో అంటే, వచ్చే ఐదేళ్లలో ఇక్కడ 200 ఇంటర్ సిటీ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు.
ఇక్కడ తయారయ్యే కొత్త రైళ్లు తక్కువ దూర ప్రయాణాల కోసం ఉపయోగించబడతాయి. సాధారణంగా 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ రైళ్లు మధ్యలో పలు స్టేషన్లలో ఆగేలా తయారు చేస్తున్నారు. సమీప పట్టణాలు, నగరాల మధ్య ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రోగులు వంటి సాధారణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని రైల్వే వెల్లడించింది.
ప్రస్తుతం చాలా మంది తక్కువ దూర ప్రయాణాల కోసం రోడ్డు మార్గాలపై ఆధారపడుతున్నారు. కొత్త ఇంటర్ సిటీ రైళ్లు అందుబాటులోకి వస్తే రోడ్డు రవాణా ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రైళ్లు పక్కపక్కనే ఉన్న పట్టణాలను కలిపే షటిల్ సర్వీసుల మాదిరిగా పని చేస్తాయి. వేగవంతమైన, సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందించనున్నాయి.
కాజీపేట యూనిట్ లో తయారయ్యే ఈ రైళ్లు ఆధునిక సదుపాయాలతో ఉండనున్నాయి. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్, మెరుగైన వెంటిలేషన్, సురక్షిత కోచ్ డిజైన్ లాంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఒక్కో రైలులో 20 కోచ్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి కోచ్లో రెండు టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ రైళ్లలో లేటెస్ట్ జర్క్ ఫ్రీ కప్లర్లు, కొత్త తరహా బోగీలు ఉపయోగించనున్నారు. రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచేలా డిజైన్ చేస్తున్నారు. దీంతో తక్కువ దూర ప్రయాణాలు మరింత వేగంగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఈ ఇంటర్ సిటీ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ కూడా ఉండనుంది. అంటే, రైలు బ్రేక్ వేయబడినప్పుడు కొంత శక్తి తిరిగి విద్యుత్ రూపంలో ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ను తిరిగి గ్రిడ్ లోకి పంపే విధంగా ఈ సిస్టమ్ పని చేస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా, ఇది పర్యావరణహిత రవాణా విధానంగా మారుతుంది. ఈ రైళ్ల వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి, క్లీన్ రవాణా వ్యవస్థకు దోహదం అవుతుంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా తక్కువ దూర రైలు ప్రయాణాలను మరింత మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
కాజీపేట రైలు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణకు మాత్రమే కాకుండా దేశ రైల్వే రంగానికి కూడా కీలక ప్రాజెక్ట్ కానుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, భవిష్యత్తులో భారతీయ రైల్వే ఆధునికీకరణలో ఈ యూనిట్ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్లో ఇక ఆకాశ ప్రయాణం.. గంట జర్నీ ఇక 16 నిమిషాల్లోనే!