Hyderabad New Ropeway Proposal: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్స్ లో రోడ్లపై వాహనాలు కదలడానికి కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కొత్త తరహా రవాణా వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వారణాసిలో విజయవంతంగా అమలవుతున్న రోప్ వే మోడల్ ను హైదరాబాద్లో కూడా ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అమలైతే నగర ప్రజలు రోడ్లపై ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఉండదు. ఆకాశ మార్గంలో ప్రయాణించే ఈ రోప్ వేలు నగర రవాణాలో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టనున్నాయి.
ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గాల్లో గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు సుమారు 2 కిలోమీటర్ల రోప్ వే మార్గం నిర్మించాలని భావిస్తున్నారు. అక్కడి నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు మరో కనెక్టివిటీ ప్రతిపాదిస్తున్నారు. ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు కూడా ప్రత్యేక రోప్ వే సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా రోప్ వే కనెక్టివిటీపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ రోప్ వే ప్రాజెక్ట్ వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో గంటకు పైగా పట్టే ప్రయాణం, రోప్ వే ద్వారా కేవలం 15 నుంచి 16 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు అందరికీ పెద్ద ఊరట లభించనుంది.
పర్యాటక రంగానికి కూడా ఈ ప్రాజెక్ట్ మంచి ఊపు తీసుకురానుంది. గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ లాంటి చారిత్రక ప్రదేశాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశం ఉండటం పర్యాటకులను ఆకర్షించనుంది. దీంతో దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య పెరగనుంది. ఈ రోప్ వే వ్యవస్థ ఎకో ఫ్రెండ్లీగా ఉండనుంది. విద్యుత్ ఆధారంగా పని చేయడం వల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది. అలాగే రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గితే ఇంధన వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ ను మెట్రో రైలు సేవలతో అనుసంధానం చేయాలనే కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మెట్రో స్టేషన్ల దగ్గర రోప్ వే స్టేషన్లు ఏర్పాటు చేసి చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచాలని భావిస్తున్నారు. దీంతో ప్రజలు ఒకే టికెట్ తో మెట్రో, రోప్ వే సేవలను వినియోగించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) పద్దతిలో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఆధునిక సాంకేతికతతో రోప్ వేలను అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. టికెట్ ధరలను కూడా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయించే అవకాశం ఉంది.
Read Also: రాత్రి కూడా పగలే.. ప్రపంచంలో సూర్యుడు అస్తమించని 8 ప్రాంతాలు ఇవే!