భారతీయ రైల్వేలోకి బుల్లెట్ రైళ్లు అడుగు పెట్టబోతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య ఇప్పటికే బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. కొన్ని కీలక ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు 2029 వరకు ట్రయల్ రన్ జరుపుకునే అవకాశం ఉంది. అటు బెంగళూరు-హైదరాబాద్ మధ్య కూడా బుల్లెట్ రైలు రాబోతోంది. బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. భూసేకరణ, అలైన్మెంట్ ప్రణాళికపై కేంద్రం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు వేగవంతం చేసింది. తాజా కేంద్ర బడ్జెట్ లో బెంగళూరు-హైదరాబాద్ 626 కి.మీ కారిడార్ కు నిధులు కేటాయించింది. దక్షిణ భారతంలో అత్యంత వేగవంతమైన ఇంటర్-సిటీ కనెక్షన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోనుంది.
ప్రస్తుతం బెంగళూరు-హైదరాబాద్ మధ్య రైలు ప్రయాణం 8 నుంచి 19 గంటలు పడుతుంది. వందే భారత్ రైళ్లు కూడా 8 గంటలకు పైగా ప్రయాణ సమయాన్ని తీసుకుంటున్నాయి. త్వరలో అందుబాటులోకి రాబోయే కొత్త బుల్లెట్ రైలు జస్ట్ 2 గంటల్లోనే రెండు నగరాలను కలపనుంది. ఈ రైలు రెండు టెక్ హబ్ల మధ్య వ్యాపార ప్రయాణికులు, ఐటీ నిపుణులు, తరచుగా ప్రయాణించేవారికి చాలా లాభాన్ని కలిగించనుంది.
తాజాగా ప్రణాళికల ప్రకారం, ఈ బుల్లెట్ రైలు సుమారు 626 కి.మీ ఉంటుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 12 స్టేషన్లను కలిగి ఉంటుంది. కర్ణాటకలో, మూడు స్టేషన్లు ఉంటాయి. అలిపుర (గౌరిబిదనూర్ తాలూకా), దేవనహళ్లి (బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో), కోడిహళ్లి (బెంగళూరు రూరల్ జిల్లా) వీటిని ఏర్పాటు చేయనున్నారు. కోడిహళ్లి ప్రధాన ఇంటర్ చేంజ్ స్టేషన్ గా మారే అవకాశం ఉంది. కర్ణాటకలోకి ఎంట్రీ ఇచ్చే ముందు మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, హిందూపూర్ సహా మరికొన్ని స్టేషన్లు ఉండనున్నాయి.
ఈ మార్గంలో బుల్లెట్ రైలు 350 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. 320 కి.మీ. ఆపరేషనల్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ ఎక్కువగా ప్రస్తుత రైల్వే లైన్ల నుంచి వేరుగా ఉన్న కొత్త అలైన్మెంట్ వెంట ఎలివేటెడ్ ట్రాక్లపై నిర్మించబడుతుంది. ప్రస్తుతం RITES లిమిటెడ్ ఫైనల్ సర్వేలను నిర్వహిస్తోంది. DPR మార్చి 2026 వరకు అందించే అవకాశం ఉంది.
కర్ణాటకలో భూసేకరణకు సంబంధించి కేంద్రం సిద్ధ రామయ్య ప్రభుత్వ చర్చలు మొదలుపెట్టింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, చర్చలను వేగవంతం చేయడానికి నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, రెండు నగరాల మధ్య ప్రయాణం పూర్తిగా మారిపోనుంది. వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. దక్షిణ భారతంలో ఆర్థిక సంబంధాలు బలోపేతం కానున్నాయి.
Read Also: హైడ్రోజన్ ట్రయల్ రన్ షురూ, స్పీడ్ ఎంతో తెలుసా?