Hydrogen Train Trial Run: భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ జరుపుకుంటుంది. హర్యానాలో రైలును పరీక్షిస్తున్నారు. ట్రయల్ రన్ సజావుగా జరుగుతున్న నేపథ్యంలో.. గ్రీన్ రైలు ప్రయాణానికి కీలక ముందడుగు పడింది. ఈ రైలు ఉదయం 8.30 గంటలకు జింద్ రైల్వే స్టేషన్ నుంచితన ప్రయాణాన్ని ప్రారంభించి లలిత్ ఖేరా వైపు ప్రయాణించి, యు టర్న్ తీసుకొని తిరిగి వచ్చింది. ఎనిమిది కోచ్లతో నడుస్తున్న హైడ్రోజన్ రైలు రైల్వే ట్రాక్పై గరిష్టంగా 70 కి.మీ వేగంతో ప్రయాణించింది. ఈ ట్రయల్ మొత్తం 20 కిలోమీటర్ల దూరం పాటు కొనసాగింది. వచ్చే వారంలో మరో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ రైల్లో పలువురు రైల్వే అధికారులు, RPF సిబ్బంది ప్రయాణించారు.
ఇవాళ ఉదయం 8.30 గంటలకు హైడ్రోజన్ రైలు జింద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరింది. ఇద్దరు లోకో పైలట్లు ఈ రైలును నడిపించారు. భద్రత, ఆపరేషన్స్ ను పర్యవేక్షించడానికి కొంతమంది రైల్వే సిబ్బందితో పాటు RPF జవాన్లు రైల్లో ప్రయాణించారు. ఎనిమిది బోగీలతో కూడిన ఈ రైలు, ట్రాక్ మీద స్థిరంగా ముందుకు ప్రయాణించింది. గంటకు 70 కి.మీ. వేగాన్ని కొనసాగించింది. ఈ రైలు లలిత్ ఖేరా రైల్వే స్టేషన్ వరకు వెళ్లి, తిరిగి మళ్లీ జింద్ స్టేషన్ కు వచ్చింది. తొలి ట్రయల్ అంతా సజావుగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు.
హైడ్రోజన్ రైలు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పనితీరు, భద్రత, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించడానికి మరో వారం రోజుల పాటు ట్రయల్ రన్స్ కొనసాగుతాయన్నారు. ఈ ట్రయల్స్ అన్నీ సజావుగా కొనసాగితే, హైడ్రోజన్ రైలును ఇండియన్ రైల్వేలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ రైలు ట్రయల్స్ సక్సెస్ అయిన తర్వాత జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడపాలని రైల్వే బోర్డు భావిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ఈ హైడ్రోజన్ రైళ్లకు అవసరమైన హైడ్రోజన్ కోసం జింద్ లో హైడ్రోజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచే హైడ్రోజన్ రైళ్లకు ఇంధన సరఫరా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్లాంట్ ను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన మార్గాల్లో డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఇక తాజాగా ట్రయల్ లో భాగంగా హైడ్రోజన్ రైలు ట్రాక్పై సజావుగా కదులుతున్నట్లు కనిపించింది. రైల్వే బృందాలు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణ డాక్యుమెంటేషన్ లో భాగంగా ట్రయల్ రన్ సమయంలో రైలుకు సంబంధించి విజువల్స్ ను కూడా రికార్డు చేశారు. ట్రయల్ రన్స్ పూర్తి అయిన తర్వాత నివేదికలను రైల్వే బోర్డుకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: హోలీ వేళ తెలుగు రాష్ట్రాలకు 132 ప్రత్యేక రైళ్లు.. ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!