BRICS Summit 2026: న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు సందడి కొనసాగుతోంది. పుల దేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు, ప్రతినిధులకు దేశ రాజధానిలోని ప్రముఖ హోటళ్లు ప్రత్యేక ఆతిథ్యం అందిస్తున్నాయి. సాధారణ స్వాగతానికి భిన్నంగా, అతిథుల దేశాల సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను కలిపి చూపించేలా ప్రత్యేక వంటకాలు, అలంకరణలు సిద్ధం చేశాయి.
బ్రిక్స్ సదస్సు కోసం 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల నుంచి ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరి కోసం ఐటీసీ మౌర్య, తాజ్ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్, తాజ్ మహల్ హోటల్, ది ఒబెరాయ్ సహా 11 ప్రముఖ హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి సమావేశం కావడంతో హోటళ్ల వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.
ఐటీసీ మౌర్యలో అతిథులను ఆకట్టుకునేలా ప్రత్యేక చాక్లెట్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో రష్యా సంస్కృతిని గుర్తు చేసే మ్యాట్రియోష్కా బొమ్మలను చాక్లెట్తో తయారు చేసి, వాటికి చేతితో రంగులు వేశారు. వాటి పక్కనే మాస్కో నగర దృశ్యాన్ని ప్రతిబింబించే చాక్లెట్ పనోరమాను ఉంచారు. దీంతో పాటు భారతీయ సంప్రదాయ మిఠాయిలను కూడా అందుబాటులో ఉంచారు. యాలకులు, కుంకుమపువ్వు, గులాబీ, అల్లం, సోంపు వంటి భారతీయ సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేసిన చాక్లెట్ బాన్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా ఒకే ప్రదర్శనలో రష్యా గుర్తింపు, భారతీయ రుచులను కలిపి చూపించే ప్రయత్నం చేశారు.
షెరటాన్ న్యూ ఢిల్లీలో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే ఎల్ సిసి కోసం ప్రత్యేక స్వాగత ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈజిప్ట్ చరిత్రకు ప్రతీకగా నిలిచే పిరమిడ్ ఆకారాన్ని పూర్తిగా చాక్లెట్తో తయారు చేశారు. దాని పక్కనే అధ్యక్షుడి చిత్రపటం, ఈజిప్ట్ జాతీయ జెండాను ఉంచారు. చేతితో తయారు చేసిన చీజ్లు, పేస్ట్రీలు, ఎండిన ఆప్రికాట్లు, గింజలతో పాటు భారతీయ స్వీట్లను కూడా అందంగా అమర్చారు. దీంతో అతిథులకు వారి దేశపు గుర్తింపుతో పాటు భారతీయ ఆతిథ్యాన్ని పరిచయం చేసేలా చేశారు.
హోటళ్ల అలంకరణలోనూ బ్రిక్స్ సదస్సు ప్రత్యేకత కనిపిస్తోంది. ఐటీసీ మౌర్య లాబీలో పసుపు, తెలుపు రంగుల చామంతులు, లిల్లీలతో బహుళ అంచెల పూల అలంకరణ చేశారు. మరో టేబుల్పై ఆకుపచ్చ, నారింజ, పసుపు, ఎరుపు రంగుల పూలతో ‘BRICS’ అనే అక్షరాలను రూపొందించారు. షెరటాన్ హోటల్ ఎంట్రెన్స్ దగ్గర కూడా భారీ కళాకృతిని ఏర్పాటు చేశారు. ఇందులో బ్రిక్స్ ఇండియా 2026 కమల చిహ్నంతో పాటు సదస్సు ప్రధాన ఆలోచనను ప్రతిబింబించే డిజైన్ను రూపొందించారు.
బ్రిక్స్ వంటి అంతర్జాతీయ సమావేశంలో అతిథుల అనుభవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. భారతీయ సంప్రదాయంలోని ‘నమస్కారం’ను ఈ స్వాగత కార్యక్రమాలకు కేంద్రంగా ఉంచారు. దేశాల మధ్య సంబంధాలు, సంస్కృతుల వైవిధ్యాన్ని ఆతిథ్యం ద్వారా చూపించేందుకు చెఫ్లు కూడా ప్రత్యేక మెనూలను సిద్ధం చేశారు. భారతీయ వంటకాల రుచులతో పాటు అతిథుల స్వదేశాలను గుర్తు చేసే అంశాలను జోడించారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు కేవలం సమావేశాలకే పరిమితం కాలేదు. హోటళ్ల అలంకరణ నుంచి ఆహారం వరకు ప్రతి అంశంలోనూ భారతీయ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేసే ప్రయత్నం కనిపిస్తోంది.
Read Also: పుతిన్ ‘రష్యా వన్’ vs జిన్పింగ్ బోయింగ్ 747.. ఎవరి విమానం ఖరీదైనదో తెలుసా?