భారతీయ విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్. త్వరలోనే కొత్త రీఫండ్ రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రభుత్వం, విమానయాన సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. చివరి నిమిషంలో అత్యవసర పరిస్థితుల కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, మొత్తం టికెట్ ఛార్జీని కోల్పోతామని ఇప్పటి వరకు చాలా మంది టెన్షన్ పడేవారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో కొత్త రీఫండ్ మోడల్ ను ప్రవేశపెట్టబోతున్నాయి.
విమాన ప్రయాణానికి మూడు గంటల కంటే తక్కువ సమయం ముందు తమ టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్ ఇవ్వరు. కొత్త విధానం ప్రయాణీకులకు ఛార్జీలో ఎక్కువ శాతం రీఫండ్ పొందే అవకాశం కలిగించనుంది. టికెట్ ధరలో 80 శాతం వరకు రీఫండ్ అందించనున్నాయి విమానయాన సంస్థలు. ఈ విధానాన్ని అమలు చేయడానికి విమానయాన శాఖ కార్యదర్శి విమానయాన సంస్థలతో చర్చలు జరపుతున్నారు. ఇందులో ప్రతి టికెట్ కొనుగోలుపై చిన్న ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ ను విమానయాన సంస్థలు తీసుకుంటాయి. ఒక్కో టికెట్ కు దాదాపు రూ. 50 వరకు ప్రీమియం చెల్లిస్తాయి. ప్రయాణీకులు తమ టికెట్లను కొనుగోలు చేసేటప్పుడు ఈ అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.
అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణీకులు విమాన టికెట్లను రద్దు చేయాల్సి వస్తే, చాలా వరకు వాళ్లు రీఫండ్ పొందరు. తమ డబ్బు మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. విమానయాన సంస్థలు అప్పుడప్పుడు ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి రాకపోతే, కొంత మేర రీఫండ్ ఇస్తారు. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసినందుకు రీఫండ్ లేకపోవడం గురించి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసురాబోతుంది. ఈ మోడల్ ను సులభతరం చేయడానికి విమానయాన సంస్థలు ఇప్పటికే బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణీకులు సరైన కారణాలతో టికెట్లను రద్దు చేసుకుంటే, ఇన్సూరెన్స్ ను విమానయాన సంస్థలు క్లెయిమ్ చేసుకుని, ప్రయాణీకులకు రీఫంగ్ అందించనున్నాయి.
ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్ టికెట్ బుకింగ్ సమయంలో ఆప్షనల్ బీమాను అందిస్తున్నప్పటికీ, కొద్దిమంది ప్రయాణీకులే దీనిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందువల్ల, ఫిర్యాదులను తగ్గించడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి విమానయాన సంస్థలు ఈ బీమాను టికెట్ ధరలో యాడ్ చేయాలని భావిస్తున్నాయి. రద్దు విధానాల ఆధారంగా బీమా కంపెనీలు ప్రీమియంలను నిర్ణయిస్తాయి.
పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (DGCA) టికెట్ రీఫండ్ల సమస్య పెరుగుతున్నట్లు గత కొంతకాలంగా గుర్తిస్తోంది. వీటిలో ఆలస్యం, టెంపరరీ రీఫండ్స్, భవిష్యత్ ప్రయాణానికి మొత్తాన్ని క్రెడిట్ షెల్ గా అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త రీఫండ్ రూల్స్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. చివరి నిమిషంలో టికెట్లను రద్దు చేసినప్పటికీ వారు తమ డబ్బును కోల్పోకుండా చర్యలు తీసుకోబోతోంది.
Read Also: నమో భారత్ లో పార్టీలు, ఫోటో షూట్స్.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!