దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో గత మూడు రోజులగా పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశ వ్యాప్తంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి విమానాశ్రయాలలో పడిగాపులుకాశారు. టెక్నికల్ సమస్యలు, వెదర్ కండీషన్స్, DGCA కొత్త నిబంధనలతో విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని ఇండిగో ప్రకటించింది.
ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని DGCA కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బందికి, ముఖ్యంగా పైలెట్లకు 48 గంటల రెస్ట్ ఇవ్వాలనే నిబంధనను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఆపరేటర్లకు ఇచ్చిన సూచనలను DGCA ఉపసంహరించుకుంది “ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమానాల రద్దుతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఇబ్బందులను తొలగించేలా, విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే విమానయాన సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని పైలెట్లకు 48 గంటల విశ్రాంతి సూచనను వెంటనే వెనక్కి తీసుకుంటున్నాం” అని వెల్లడించింది.
గత మూడు రోజులుగా ఇండిగో విమానయాన సంస్థ దేశ వ్యాప్తంగా విమానాలను రద్దు చేసింది. పలు రకాల కారణాలను చెప్తూ విమాన సర్వీసులను నిలిపివేసింది. దేశీయ విమాన మార్కెట్లో 60% కంటే ఎక్కువ వాటా కలిగిన ఇండిగో మూడు రోజులగా విమానాలను క్యాన్సిల్ చేసింది. విమానాల అంతరాయానికి అనేక కారణాలు చెప్తున్నా, అసలు విషయం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్(FDTL) నిబంధన. దీని అమలు కారణంగా ఏర్పడిన సిబ్బంది కొరతతో దేశ వ్యాప్తంగా విమానాలను రద్దు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పైలట్లకు 48 గంటలు రెస్ట్ ఇవ్వాలి. అదే జరిగితే విమానయాన సంస్థలకు అదనంగా 20 శాతం ఎక్కువ పైలట్లు అవసరం అవుతారు. అందుకే ఇండిగో ఫ్లైట్ క్యాన్సల్ సమాచారాన్ని ప్రయాణికులకు చెప్పకుండా.. ఎయిర్ పోర్టుకు రప్పించుకుందని, డీజీసీఏపై ఒత్తిడి తెచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత DGCA కీలక నిర్ణయం తీసుకుంది. పైలెట్లకు రెస్ట్ తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందుకే 36 గంటలు ఉన్న రెస్ట్ ను 48 గంటలకు పెంచాలని నిర్ణయించింది. అదే సమయంలో రాత్రిపూట ఒక్కో పైలెట్ ల్యాండింగ్స్ సంఖ్య ఆరు నుంచి రెండుకు తగ్గించింది. ఈ నిబంధనలు జూలైతో మొదటి దశ, నవంబర్ లో రెండో దశ అమల్లోకి వచ్చాయి. ఇండిగో మొదటి దశను కనీస ఇబ్బందులతో ముందుకు లాక్కొచ్చింది కానీ, రాత్రిపూట విమానాలలో సిబ్బంది వినియోగాన్ని తగ్గించే రెండవ దశను సక్సెస్ ఫుల్ గా నిర్వహించలేకపోయింది. ఇండిగో హై ఫ్రీక్వెన్సీ ఆపరేషన్స్, సిబ్బంది లీవ్స్, రాత్రిపూట విమానాల సర్వీసులు ఎక్కువగా ఉండటంతో సమర్థవంతంగా నడిపించలేక చేతులు ఎత్తివేసింది. ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందికి క్షమాపనలు చెప్పింది.
— IndiGo (@IndiGo6E) December 5, 2025
ఇండిగో 90 దేశీయ, 45 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను నడిపిస్తుంది. రోజుకు 2,300 కంటే ఎక్కువ విమానాలను నడుపుతున్నది. సంస్థ దగ్గర 400 కంటే ఎక్కువ విమానాలు ఉండగా, 10% రద్దు అయినా ప్రయాణీకుల మీద తీవ్రంగా పడుతుంది. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా గ్రూప్ సగం కంటే తక్కువ విమానాలను నడుపుతుంది.
కొత్త FDTL నిబంధనలను అమలు చేసేందుకు తగినంత సమయం ఉన్నా, ఇండిగో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పైలెట్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సంస్థ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది ప్రయాణీకులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించాయి. మరోవైపు ఇండిగో కావాలనే విమాన సర్వీసులను నిలిపివేసి, DGCA తాజా నిబంధనలను ఉపసంహరించుకునేలా చేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.