దేశ వ్యాప్తంగా ఎండలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా రికార్డు అవుతున్నాయి. ఈ వేడి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సిమ్లా, మనాలి లాంటి పాపులర్ హిల్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండి, ప్రకృతి అందాలతో ఆకట్టుకునే హిమాలయ ప్రాంతాల కోసం వెతుకుతున్నారు. వేసవిలోనూ చల్లటి గాలి, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం అందించే 5 టాప్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ తీర్థన్ లోయ, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్లోని తీర్థన్ లోయ సమ్మర్ వెకేషన్ కు బెస్ట్ డెస్టినేషన్. ఈ ప్రాంతం కులు జిల్లాలో ఉన్నది. ఈ ప్రాంతం తీర్థన్ నది కారణంగా బాగా ఫేమస్ అయ్యింది. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, పైన్ అడవులు, చిన్న చెక్క ఇళ్లు, ప్రశాంతమైన వాతావరణం టూరిస్టులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ట్రౌట్ చేపల వేటకు ఈ ప్రాంతం బాగా ఫేమస్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ సమీపంలో ఉండటం వల్ల ప్రకృతి ప్రేమికులకు ఇది బెస్ట్ ఆప్షన్ గా కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్ లోని మున్సియారి కూడా వేసవిలో వెళ్లేందుకు అద్భుతమైన ప్లేస్. కుమావోన్ పర్వత శ్రేణిలో ఉన్న ఈ చిన్న పట్టణం నుంచి హిమాలయాల అందాలు ఆకట్టుకుంటాయి. వేసవిలో కూడా ఇక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. ఎక్కువ రద్దీ లేకుండా ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం. అడవుల్లో ట్రెక్కింగ్, అందమైన పక్షులను చూడటం, హిమానీనదాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని చిత్కుల్ కూడా వేసవిలో చల్లగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ గ్రామాన్ని భారత చివరి గ్రామంగా పరిగణిస్తారు. చుట్టూ మంచుతో కప్పుకున్న పర్వతాలు, నది తీరాలు, సంప్రదాయ చెక్క ఇళ్లు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మారుస్తాయి. దేశంలోని మిగతా ప్రాంతాలు వేడితో ఇబ్బంది పడుతున్న సమయంలో ఇక్కడ మాత్రం ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ఉంటుంది.
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ కూడా వేసవి సెలవులకు మంచి డెస్టినేషన్. ఎక్కువ మంది శ్రీనగర్ కు వెళ్లినా, ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్లు పహల్గామ్ ను ఇష్టపడుతున్నారు. దేవదారు చెట్లు, పచ్చని లోయలు, నదులు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్ని ఇస్తాయి. లిద్దర్ లోయ, అరు లోయ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పగటిపూట తక్కువ ఉష్ణోగ్రతలు ఉండగా, రాత్రివేళల్లో చల్లగా ఉంటుంది.
ఇక హిమాచల్ ప్రదేశ్ లోని కల్ప గ్రామం కూడా వేసవిలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం. కిన్నౌర్ కైలాష్ పర్వతాల అందమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఇతర హిల్ స్టేషన్లతో పోలిస్తే ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. ఉదయాన్నే మంచు గాలులు, సాయంత్రం చల్లటి వాతావరణం ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. వేడిగాలుల నుంచి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ హిమాలయ ప్రాంతాలు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: భారత్ గౌరవ్ రైల్లో నేపాల్ టూర్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?