12,000 సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న.. ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది. వేల కిలోమీటర్ల దూరం బూడిదను వెదజల్లుతోంది. ఈ ఎఫెక్ట్ పలు విమాన రాకపోకలపై పడింది. పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఈ అగ్నిపర్వతం బూడిద పాకిస్తాన్, భారత్ సహా పలు ఆసియా దేశాలు, ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్ వైపుకు వెదజల్లబడుతోంది. ఈ నేపథ్యంలో ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలకు కీలక సూచలను చేశాయి. ప్రభావిత ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేయాలని సూచించింది.
⦿ హేలి గుబ్బి అగ్నిపర్వతం రిఫ్ట్ వ్యాలీలో ఉంది ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రమాదకరమైన ప్రాంతం.
⦿ ఆదివారం ఉదయం పేలుడు మొదలయ్యింది. ఆకాశంలోకి 14 కిలోమీటర్ల వరకు దట్టమైన పొగను వెదజల్లింది. చుట్టుపక్కల ప్రాంతాలను బూడిదతో కప్పేసింది.
⦿ ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చే బూడిద ప్రస్తుతం ఉత్తర భారతదేశం వైపు కదులుతోంది. ఇథియోపియాలోని ఎర్టా ఆలే శ్రేణిలో ఉన్న ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 10,000 నుంచి 12,000 సంవత్సరాల క్రితం పేలింది.
⦿ అకాసా ఎయిర్, ఇండిగో సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి.
⦿ DGCA విమానయాన సంస్థలకు అడ్వయిజరీ జారీ చేసింది. విమానాలు వెళ్లాల్సిన మార్గాలు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి హెచ్చరికలు చేసింది.
⦿ ఇథియోపియా అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల తమ సంస్థకు సంబంధించి ఏ విమానం ప్రభావింత కాలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. బూడిద ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
Read Also: విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్, గంట ముందు టికెట్ క్యాన్సిల్ చేసినా..
⦿ ఈ బూడిద కారణంగా దుబాయ్ కి వెళ్లే తమ విమానాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. దుబాయ్ కి వెళ్లే ప్రయాణీకులను వారి విమానాల స్టేటస్ లను చెక్ చేసుకోవాలని సూచించింది.
⦿ అకాసా ఎయిర్ కూడా అగ్నిపర్వత ప్రమాద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ విమానయాన ప్రొటోకాల్స్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రయాణీకుల భద్రత, శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించింది.
⦿ అగ్నిపర్వతం బూడి భారత్ వైపు కదులుతున్న నేపథ్యంలో ఎయిర్ లైన్ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని ఇండిగో తెలిపింది. సురక్షితమైన కార్యకలాపాల కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పింది.
⦿ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకుల అలర్ట్ జారీ చేసింది. ఇథియోపియాలో అగ్నిపర్వత విస్ఫోటనం కొన్ని అంతర్జాతీయ విమానాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రయాణీకులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు వారి విమానాల స్టేటస్ ను చెక్ చేసుకోవడంతో పాటు ఆయా విమాన సంస్థలతో టచ్ లో ఉండాలని సూచించింది.
Read Also: ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?