Hyderabad Metro to Start at 5 AM: హైదరాబాద్లో రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక సూచన చేసింది. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో సేవలను ఒక గంట ముందుగా, అంటే ఉదయం 5 గంటలకే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యంగా తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకునే సుదూర రైళ్ల ప్రయాణికులకు ఈ టైమింగ్స్ ఛేంజ్ తో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన సమన్వయ సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ఈ సమస్యను ప్రస్తావించారు. వందే భారత్, రాజధాని లాంటి ముఖ్య రైళ్లు ఉదయం 4:30 నుంచి 6:30 మధ్య హైదరాబాద్ చేరుకుంటున్నాయన్నారు. ఆ సమయంలో మెట్రో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి వంటి స్టేషన్ల దగ్గర దిగిన వారు ఆటోలు, క్యాబ్లకు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం మెట్రో టెర్మినల్ స్టేషన్లు అయిన మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్ నుంచి రైళ్లు ఉదయం 6 గంటలకు బయలుదేరుతున్నాయి. అవి ప్రధాన రైల్వే స్టేషన్లకు చేరేసరికి సుమారు 6:30 అవుతోంది. అందువల్ల తెల్లవారుజామున వచ్చే ప్రయాణికులకు మెట్రో సేవలు వెంటనే అందడం లేదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, మెట్రో సేవలను ముందుగా ప్రారంభించాలని ఎస్సీఆర్ సూచించింది.
ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే మెట్రో ఆపరేటర్ L&T మెట్రో రైల్ హైదరాబాద్ భద్రతా తనిఖీలు, నిర్వహణ పనులు కారణంగా ఉదయం 6 గంటలకే సేవలు ప్రారంభించడం సాధారణమని చెబుతోంది. అయినప్పటికీ, మధ్యస్థంగా ఉదయం 5:30 గంటలకు సేవలు ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ మెట్రో సేవలు ముందు ప్రారంభం అయితే, ప్రతిరోజూ తెల్లవారుజామున ప్రయాణించే 15,000 నుంచి 20,000 మంది ప్రయాణికులకు లాభం చేకూరుతుందని అంచనా. ముఖ్యంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈజీ అవుతుంది.
అటు సౌత్ సెంట్రల్ రైల్వే, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ సేవలను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి అంశాల్లో సహకారం కోరింది. చర్లపల్లి టెర్మినల్ నిర్మాణం పూర్తి దశలో ఉండగా, అక్కడి నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు, మెట్రో అనుసంధానం మెరుగుపరచాలని కూడా ఎస్సీఆర్ సూచించింది. మొత్తం మీద, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే దిశగా ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.
Read Also: తెలంగాణకు గుడ్ న్యూస్, 8 కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయ్!