Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అనుమతులు, పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు.
తుమ్మిడిహెట్టి వివాదంపై జల్శక్తి అధికారితో చర్చలు
ముందుగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్తో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఈ భేటీలో ప్రధానంగా ‘తుమ్మిడిహెట్టి’ ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు.
గతంలో 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే దానిని 150 మీటర్లకు పెంచేలా మహారాష్ట్రను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తును 150 మీటర్లకు పెంచినా ముంపు ప్రభావం వెయ్యి హెక్టార్ల లోపే ఉంటుందని వివరించారు. అంతేకాకుండా, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే విద్యుత్ వినియోగంతో పనిలేకుండా గ్రావిటీ ద్వారానే నీటిని తరలించే అవకాశం ఉంటుందని జల్శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పర్యావరణ అనుమతులపై భూపేందర్ యాదవ్తో భేటీ
ఆ తర్వాత కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసింది. తెలంగాణలో నిలిచిపోయిన పలు నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రతిపాదిత రహదారుల నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఎస్ఆర్ విఆర్ డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని సీఎం స్పష్టం చేశారు.
Also Read: హైడ్రా బాస్ సంతకానికే ఎసరు.. ఏకంగా రంగనాథ్ పేరుతో నకిలీ NOCలు, 8 కాలేజీలపై కేసు!