హైదరాబాద్ నుంచి మరో మూడు కొత్త రెగ్యులర్ రైళ్లను కేంద్ర రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల రద్దీ.. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను శాశ్వత ప్రాతిపదికన నడిచేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ – ట్యూటికోరిన్, హైదరాబాద్ – కన్యాకుమారి, చర్లపల్లి – షాలిమార్ మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో ఇది కీలక అడుగుగా మారుతుంది.
ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 2014 నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ టెర్మినళ్ల నుంచి మొత్తం 91 కొత్త రైలు సర్వీసులు ప్రారంభమైనట్లు వివరించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.
కాచిగూడ – ట్యూటికోరిన్ ఎక్స్ప్రెస్ (17615/17616) ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయల్దేరుతుంది. మంగళవారం రాత్రి 10:45 గంటలకు ట్యూటికోరిన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం 7:45 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి.. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు మీదుగా ప్రయాణిస్తుంది.
హైదరాబాద్ – కన్యాకుమారి ఎక్స్ప్రెస్ (17069/17070) ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్లో ప్రారంభమవుతుంది. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం శుక్రవారం ఉదయం 5:15 గంటలకు మొదలై.. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ముగుస్తుంది. సికింద్రాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి కీలక ప్రాంతాలను ఈ రైలు కలుపుతుంది.
చర్లపల్లి – షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (17065/17066) ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లిలో బయల్దేరుతుంది. బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ చేరుకుంటుంది. తిరిగి బుధవారం మధ్యాహ్నం 12:50 గంటలకు బయల్దేరి.. గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లి వస్తుంది. ఇది వరంగల్, ఖమ్మం, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా నడుస్తుంది.
తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రానికి మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఐదు వందే భారత్, నాలుగు అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. ఈ కొత్త రెగ్యులర్ రైళ్లు ప్రయాణికులకు మరింత చేరువ కావడంతో పాటు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: Regional Ring Rail: భాగ్యనగరం చుట్టూ రింగ్ రైలు.. సర్వేకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!