Driverless Transport System: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం లక్ష్యంగా కొత్త రవాణా వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం ప్రణాళికలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా డ్రైవర్ లెస్ట్ పాడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటుపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం ప్రారంభమైంది.
ముంబైలో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ ఆధునిక రవాణా నమూనాలను పరిశీలిస్తూ, హైదరాబాద్లో కూడా అదే తరహా సిస్టమ్ ను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పాడ్ ట్రాన్సిట్ వ్యవస్థ చిన్న, ఆటోమేటెడ్ వాహనాల ద్వారా ప్రయాణికులను ఒక స్టేషన్ నుంచి మరో ప్రాంతానికి వేగంగా, సులభంగా తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ప్రతిపాదిత నెట్ వర్క్ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, స్టేట్ సెక్రటేరియట్, నాలెడ్జ్ సిటీ, రాయదుర్గ్ వంటి కీలక ప్రాంతాలను అనుసంధానించనుంది. అలాగే రాయదుర్గ్ నుంచి కూకట్పల్లి వరకు ఉన్న కారిడార్ కూడా ఇందులో భాగం కావచ్చు. ఈ ప్రాంతాలు హైదరాబాద్లో ఐటీ, వ్యాపార కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలు కావడంతో, ఇక్కడ వేగవంతమైన కనెక్టివిటీ అవసరం ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం, ఈ ప్రాజెక్ట్ కోసం సాంకేతిక, ఆర్థిక అంశాలను విశ్లేషించే టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ (TEFS) జరుగుతోంది. ఈ అధ్యయనం ద్వారా ప్రాజెక్ట్ అమలు సాధ్యాసాధ్యాలు, ఖర్చులు, ప్రయోజనాలు, ఉపయోగించే సాంకేతికతపై పూర్తి స్పష్టత రానుంది. దీని కోసం LEA అసోసియేట్స్, RITES లిమిటెడ్, బాలాజీ రైల్ రోడ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు బిడ్లు వేశాయి.
Read Also: దేశంలోనే లార్జెస్ట్ లగ్జరీ రిసార్ట్, అమ్మో.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?
ఈ ప్రాజెక్ట్ ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (PPP) మోడల్లో అమలు చేయాలని నిర్ణయించారు. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ ఫర్ (DBFOT) విధానంలో ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ప్రస్తుతం సాంకేతిక బిడ్లను పరిశీలిస్తున్న అధికారులు, త్వరలో ఆర్థిక బిడ్లను కూడా ఓపెన్ చేయనున్నారు. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత రూట్లు, స్టేషన్ల ఎంపిక, ఖర్చు అంచనాలు, చట్టపరమైన అంశాలపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధమవుతుంది. మొత్తంగా, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, హైదరాబాద్ లో రవాణా రంగంలో కొత్త మార్పుకు పునాది పడనుంది. నగరంలో ప్రయాణం మరింత సులభంగా, వేగంగా మారే అవకాశం ఉంది.
Read Also: రూ. 49 లక్షలు పెట్టి టిక్కెట్లు కొన్నా, విమానం ఎక్కనివ్వని సిబ్బంది..అసలేం జరిగిందంటే?