Amazing Indian Railways Facts: ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. కానీ, భారతీయ రైల్వే ఎంత పెద్ద వ్యవస్థో, రోజూ ఎన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుందో చాలా మందికి తెలియదు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటైన భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఏకంగా 741 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.54 శాతం ఎక్కువ. అంటే.. రోజుకు సగటున 2.3 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారన్న మాట. ఈ సంఖ్య దాదాపు ఆస్ట్రేలియా మొత్తం జనాభాతో సమానం కావడం విశేషం.
దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే ప్రతి రోజు 13 వేలకుపైగా ప్రయాణికుల రైళ్లను నడుపుతోంది. ఇవి 7,325 రైల్వే స్టేషన్లను కలుపుతూ కోట్లాది మందికి సేవలు అందిస్తున్నాయి. చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు ప్రజలను కలిపే ప్రధాన రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది.
భారతీయ రైల్వే ట్రాక్ల మొత్తం పొడవు 68 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇది భూమిని దాదాపు రెండుసార్లు చుట్టివచ్చేంత దూరం. అన్ని రైళ్లు కలిపి రోజుకు సుమారు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
భారతీయ రైలు ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత చౌకైనది. సగటున ఒక ప్రయాణికుడు ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం 38 పైసలు మాత్రమే చెల్లిస్తున్నాడు. అందుకే సాధారణ ప్రజలకు రైలు ఇప్పటికీ అత్యంత అందుబాటు ప్రయాణంగా కొనసాగుతోంది.
భారతీయ రైల్వే ప్రయాణికుల్లో 53 శాతం మంది సబర్బన్ ప్రయాణికులే. వీరు తక్కువ ఛార్జీలు చెల్లిస్తూ ప్రతిరోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం ప్రయాణిస్తుంటారు. అయితే, మొత్తం ఆదాయంలో వీరి వాటా మాత్రం చాలా తక్కువ కావడం విశేషం.
సాంకేతికంగా భారతీయ రైల్వే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైళ్లు, 72 అమృత్ భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. వేగం, సౌకర్యం, ఆధునిక సదుపాయాలతో ఈ రైళ్లు ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, ఒకే యాజమాన్యం కింద నడిచే అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే. ప్రతి రోజు కోట్లాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా నిలుస్తోంది. అందుకే భారతీయ రైల్వేను దేశానికి జీవనాడిగా పిలుస్తారు.
Read Also: ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు కూడా ఉన్నాయా? జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!