IndiGo Direct Flights from Vijayawada: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి విజయవాడ నుంచి వారణాసి, కోల్కతాకు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆధ్యాత్మిక యాత్రలు, బిజినెస్ ట్రావెల్స్, వెకేషన్ టూర్లు మరింత ఈజీగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఈ నగరాలకు వెళ్లాలంటే మధ్యలో మరో విమానం మారాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ సర్వీస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణం కూడా మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.
ఈ కొత్త విమానాలు ప్రతి వారం మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో నడుస్తాయి. వారణాసి నుంచి మధ్యాహ్నం 3:55 గంటలకు బయలుదేరే విమానం సాయంత్రం 5:50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరి రాత్రి 8:15 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. అక్కడి నుంచి అదే విమానం కోల్కతాకు వెళ్లి రాత్రి 10:15 గంటలకు చేరుకుంటుంది.
ఈ కొత్త సర్వీస్ వల్ల ముఖ్యంగా వారణాసికి వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. కాశీ విశ్వనాథ ఆలయం, గంగా ఘాట్లు, పురాతన దేవాలయాలను సందర్శించాలనుకునే వారికి ఈ డైరెక్ట్ ఫ్లైట్ మంచి అవకాశం కానుంది. మరోవైపు కోల్కతాకు వెళ్లే వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఈ సర్వీస్ ద్వారా వేగంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కోల్కతా ప్రముఖ వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా ఉండటంతో ఈ రూట్ కు మంచి డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఈ కొత్త రూట్లు మరింత ప్రాధాన్యతను తీసుకురానున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ఉన్న ఈ ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఉత్తర, తూర్పు భారతంతో మరింత బలమైన కనెక్టివిటీ ఏర్పడనుంది.
ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో వరుసగా కొత్త రూట్లను ప్రారంభిస్తోంది. విజయవాడ నుంచి వారణాసి, కోల్కతాకు డైరెక్ట్ విమానాలు అందుబాటులోకి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవాలనుకునే వారికి ఈ సర్వీస్ మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త విమాన సర్వీసులు తీర్థయాత్రలు, పర్యాటకం, వ్యాపారం, కుటుంబ ప్రయాణాలకు మరింత ఉపయోగపడనున్నాయి.
Read Also: జస్ట్ రూ.23 వేలకే.. రౌండ్ ట్రిప్, ఆగస్టులో ఈ ప్రాంతాలకు వెళ్లి వచ్చేయండి!