Indian Railway: దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దు అయిన నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మెరుగైన సర్వీసులు అందించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్లను యాడ్ చేస్తున్నట్లు తెలిపింది. దక్షిణ రైల్వే పరిధిలోని రైళ్లకు కోచ్ ల సంఖ్య గణనీయంగా పెంచుతున్నట్లు వెల్లడించింది. మరో 18 రైళ్లలో సామర్థ్యాన్ని పెంచినట్లు వివరించింది. “అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్లను జతచేశాం. విమాన రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని రైల్వే ప్రకటించింది.
అటు ఉత్తర రైల్వే పరిధిలో ఎనిమిది రైళ్లలో కోచ్ లను పెంచినట్లు రైల్వే తెలిపింది. వీటిలో 3AC, చైర్ కార్ కోచ్లను యాడ్ చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయంతో నార్త్ కారిడార్ లో ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుకానుంది. అటు పశ్చిమ రైల్వే పరిధిలోని నాలుగు ఎక్కుడ డిమాండ్ ఉన్న రైళ్లకు 3AC, 2AC కోచ్లను జోడించింది. ఈ నిర్ణయంతో పశ్చిమ ప్రాంతాల నుంచి దేశ రాజధానికి ఈజీగా రాకపోకలు కొనసాగించే వెసులు బాటు కల్పిస్తోంది. “అటు తూర్పు మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లకు అదనపు 2AC కోచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ రైళ్లు బీహార్- ఢిల్లీ సెక్టార్లో మెరుగైన సామర్థ్యాన్ని అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో మూడు రైళ్లకు 2AC కోచ్లను యాడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు భువనేశ్వర్- న్యూఢిల్లీ మధ్య సేవలు అందించనున్నాయి. ఒడిశా, దేశ రాజధాని మధ్య కనెక్టివిటీని మెరుగు పరచనున్నాయి. అటు తూర్పు రైల్వే పరిధిలో డిసెంబర్ 7, 8 తేదీలలో మూడు కీలక రైళ్లకు కోచ్ లను పెంచినట్లు అధికారులు తెలిపారు.
అటు ఈశాన్య సరిహద్దు రైల్వే డిసెంబర్ 6 నుంచి 13 వరకు రెండు రైళ్లకు అదనపు కోచ్ లు పెంచింది. ఈ రైళ్లు 8 ట్రిప్పులు నడవనున్నాయి. ఇందులో 3AC, స్లీపర్ కోచ్లను పెంచినట్లు వెల్లడించింది. ఈ పెంపు ఈశాన్య ప్రాంతంలోని ప్రయాణికులకు నిరంతరాయ ప్రయాణాలను అందిస్తుంది.
ఓ వైపు పలు రైళ్లకు కోచ్ లను పెంచడంతో పాటు మరికొన్ని అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆయా రద్దీ మార్గాల్లో నడిపేలా 4 రైళ్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. గోరఖ్పూర్- ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడిచేలా గోరఖ్పూర్ స్పెషల్ (05591, 05592) రైలును తీసుకొచ్చారు. ఇది డిసెంబర్ 7- 9 మధ్య నాలుగు ట్రిప్పులను నడపనున్నారు. అటు న్యూఢిల్లీ- కెప్టెన్ తుషార్ మహాజన్ మధ్య నడిచే న్యూఢిల్లీ రిజర్వ్డ్ వందే భారత్ స్పెషల్ (02439, 02440) డిసెంబర్ 6న నడుస్తుంది. ఈ రైలు జమ్మూ ప్రాంతానికి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. అటు పశ్చిమ సెక్టార్ కోసం న్యూఢిల్లీ- ముంబై సెంట్రల్ న్యూఢిల్లీ రిజర్వ్డ్ సూపర్ఫాస్ట్ స్పెషల్ (04002, 04001) డిసెంబర్ 6, 7 తేదీల్లో నడపనున్నట్లు రైల్వే తెలిపింది. హజ్రత్ నిజాముద్దీన్- తిరువనంతపురం సెంట్రల్ రిజర్వ్డ్ సూపర్ఫాస్ట్ స్పెషల్ (04080) డిసెంబర్ 6న అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: శబరిమలకు ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే