Vande Bharat Sleeper Train Opening: భారతీయ రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. జనవరి నాటికి తొలి వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మార్చినాటికి మొత్తం 8 స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని ప్రాణాళికలు వేస్తోంది. సుదూర రాత్రిపూట రైలు ప్రయాణానికి అనుగుణంగా వీటిని పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించిన కోచ్ లను పెరంబూరులోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేస్తున్నారు. స్లీపర్ వేరియంట్ల ఉత్పత్తి గత సంవత్సరం బెంగళూరులోని BEML సౌకర్యంలో ప్రారంభమైందని అధికారులు తెలిపారు. 6 కోచ్లు కలిగిన ప్రోటోటైప్ను ఢిల్లీకి పంపే ముందు మరిన్ని పరీక్షల కోసం ICFకి తరలించారని వెల్లడించారు. జనవరిలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ రైలు అహ్మదాబాద్ లో ట్రయల్ రన్స్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్ లోని కోటాలో వందేభారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన ట్రయల్స్ కొనసాగినట్లు వివరించారు. మార్చి చివరి నాటికి 8 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా గుర్తింపు తెచ్చుకోనున్నాయి. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోనున్నాయి. ఈ రైళ్లను సుమారు 800 కిలో మీటర్ల రేంజ్ లో ఉండే నగరాల మధ్య నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) టెక్నాలజీని ఉపయోగించి BEML తయారు చేసింది. ఈ స్లీపర్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. వీటిని AC ఫస్ట్ క్లాస్, AC 2-టైర్, AC 3-టైర్లుగా విభజించారు. ఒక రైల్లో ఒకేసారి 1,128 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది దేశంలో అత్యంత వేగవంతమైన రాత్రిపూట ప్రయాణాన్ని అందించే రైలు సేవలలో ఒకటిగా మారుతుంది. వందేభారత్ స్లీపర్ రైలు అనేక అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఆటోమేటిక్ డోర్లు, సౌకర్యవంతమైన బెర్తులు, విమానంలో మాదిరి డిజైన్, ఆన్-బోర్డ్ Wi-Fi లాంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త సెమీ-హై స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. సున్నితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
అటు ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. మొత్తం 160 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు మరింత వేగంగా ప్రయాణీకులకు ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి. అయితే, ఫస్ట్ రైలు ఏ రూట్లో అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా రైల్వే క్లారిటీ ఇవ్వలేదు.