Indian Railways TTE Rules: భారతీయ రైల్వేల్లో TTE (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) పాత్ర ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే. తెల్లటి దుస్తులు, పైన నల్లటి కోటు ధరించి, చేతిలో చార్ట్ పట్టుకుని ‘టికెట్.. టికెట్..’ అంటూ భోగీల్లో తిరిగే TTE కనిపించగానే ప్రయాణికులందరూ ఒక్కసారిగా టెకిట్స్ ఎక్కడ పెట్టామా అని వెతుకుతుంటారు.
టికెట్లను తనిఖీ చేయడమే కాకుండా.. ప్రయాణికులకు కేటాయించిన సీట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూడటం, రైలులో శాంతిభద్రతలను పర్యవేక్షించడం, ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు అందుతున్నాయో లేదో గమనించడం వంటి కీలక బాధ్యతలన్నీ TTE భుజస్కంధాలపైనే ఉంటాయి.
అయితే, ఒక TTE రైలులోని భోగీలన్నింటినీ తనిఖీ చేయవచ్చా? లేదా వారికి నిర్దిష్టమైన పరిమితి ఉందా? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. నిజానికి, ఒక టీటీఈ ఎన్ని భోగీలను (కోచ్లను) తనిఖీ చేయాలనే దానిపై రైల్వే శాఖకు స్పష్టమైన, ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
రైలు ఎక్కిన ప్రయాణికుల టికెట్లను సరిచూడటం, అనుమతి లేని వారిని లేదా పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే వారి నుంచి రుసుము వసూలు చేయడం టీటీఈ ప్రాథమిక విధి. వీటితో పాటు బోగీల్లోకి అనధికారిక వ్యక్తులు రాకుండా చూడటం, ధూమపానం చేసేవారిపై చర్యలు తీసుకోవడం, నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకోవడం వంటి పనులను కూడా వీరు పర్యవేక్షిస్తారు.
Also Read: డెల్ నుంచి అడ్వాన్స్డ్ ఏఐ ల్యాప్టాప్లు వచ్చేసాయి.. 17 గంటల బ్యాటరీ లైఫ్తో!
ప్రయాణంలో ఎవరికైనా హఠాత్తుగా అనారోగ్యం చేసినా లేదా వైద్య సాయం కావాల్సి వచ్చినా TTE వెంటనే స్పందిస్తారు. ప్రయాణికుల నుంచి సమాచారం అందగానే.. తర్వాతి రైల్వే స్టేషన్ లేదా కంట్రోల్ ఆఫీస్కు కబురు అందించి, తదుపరి స్టేషన్లో వైద్య సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో వీరిది ముఖ్య పాత్ర.
రైలులోని కోచ్ల రకాన్ని బట్టి టీటీఈల నియామకం ఉంటుంది. రైల్వే శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. AC భోగీల విషయానికి వస్తే ఒక టీటీఈ గరిష్టంగా ఐదు కోచ్లను పర్యవేక్షించవచ్చు. అలాగే సీటింగ్ లేదా స్లీపర్ క్లాస్ భోగీలైతే ఒక టీటీఈకి గరిష్టంగా మూడు కోచ్ల బాధ్యతలను కేటాయిస్తారు.
అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఇండియన్ రైల్వేస్ వివిధ జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది పని వేళలకు భంగం కలగకుండా, వారి సేవలను దూర ప్రాంతాల వరకు పొడిగించడం, అనవసరమైన ప్రాంతాల నుంచి సిబ్బందిని తగ్గించి రైళ్లలో ఎక్కువ మందిని అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల ప్రయాణికులకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలు అందుతాయి.
Also Read: రూ.16 వేలకే రఫ్ అండ్ టఫ్ ఫోన్.. సన్రైజ్ గోల్డ్ కలర్లో ఆకట్టుకుంటున్న Honor X6e 4G!