IRCTC Announces ‘Divya Dakshina Yatra’: సమ్మర్ వేళ ఆలయాల సందర్శనకు వెళ్లే పర్యాటకుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న ఈ టూర్.. దక్షిణ భారతంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా రూపొందించబడింది. ఈ టూర్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్లో కొనసాగుతుంది.
ఈ ప్రత్యేక రైలు ఏప్రిల్ 27న విశాఖపట్నం నుంచి బయలుదేరి, మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగిస్తుంది. మే 4న ఈ టూర్ ముగుస్తుంది. ఈ యాత్రలో యాత్రికులు పలు ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు.
ఈ యాత్రలో భాగంగా కాంచిపురం కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, వరదరాజ పెరుమాళ్ ఆలయాలను దర్శించవచ్చు. అలాగే మహాబలిపురంలోని ప్రసిద్ధ తీర దేవాలయం, కృష్ణుని వెన్న బంతి లాంటి చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, అలాగే తిరుచునాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం లాంటి ముఖ్య క్షేత్రాలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. అలాగే అరుణాచలం దేవాలయం కూడా యాత్రలో భాగం కానుంది.
ఈ రైలులో ప్రయాణికులు పలు స్టేషన్లలో ఎక్కవచ్చు. విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు వంటి స్టేషన్లలో ఎక్కడం, దిగడం లాంటి సౌకర్యం ఉంది. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ ఎకానమీ క్లాస్ (స్లీపర్)లో అందించబడుతోంది. పెద్దల కోసం టికెట్ ధర రూ. 14,700 కాగా, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ. 13,800గా నిర్ణయించారు. ఈ మొత్తంలో వసతి, భోజనం, రవాణా లాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రయాణికులకు నాన్ ఏసీ హోటళ్లలో వసతి, నాన్ ఏసీ వాహనాలలో ప్రయాణం ఏర్పాటు చేస్తారు. రోజూ ఉదయం టీ, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. అయితే, ఇది పూర్తిగా శాకాహారం. ప్రయాణ సమయంలో భద్రత కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ మొత్తం సమయంలో గైడ్లు, IRCTC టూర్ మేనేజర్ల సహాయం కూడా అందుబాటులో ఉంటుంది.
ఇక ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి బుకింగ్ కోసం ఆసక్తి ఉన్న వారు విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని IRCTC కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫోన్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. తక్కువ ఖర్చుతో దక్షిణ భారతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి ఈ ‘దివ్య దక్షిణ యాత్ర’ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
Read Also: రైల్వే గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి ఏపీకి సమ్మర్ స్పెషల్ రైళ్లు!