12-Day Divine Journey: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను దర్శించాలని భావిస్తున్న టూరిస్టుల కోసం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా నిర్వహించే ఈ యాత్రలో తిరుపతి బాలాజీ, రామేశ్వరం, మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారి, శ్రీశైలం లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.
సౌత్ ఇండియన్ టూర్ మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు కొనసాగనుంది. జూలై 31న గోరఖ్ పూర్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరనుంది. ఈ యాత్రలో భాగంగా భక్తులు దక్షిణ భారతంలోని పలు ప్రసిద్ధ ఆలయాలను దర్శించే అవకాశం ఉంది. తమిళనాడులోని రామేశ్వరంలోని ప్రసిద్ధ రామనాథస్వామి ఆలయం, మదురైలోని చారిత్రాత్మక మీనాక్షి అమ్మవారి ఆలయం, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్యాకుమారి తీర్థక్షేత్రం, అలాగే ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులోని శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఈ యాత్రలో దర్శించుకునే అవకాశం ఉంటుంది.
పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని IRCTC పలు సేవలను అందిస్తోంది. రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, స్థానిక బస్సు రవాణా, భోజన సదుపాయం, టూర్ ఎస్కార్ట్ సేవలు, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటటి సౌకర్యాలు ప్యాకేజీలోనే ఉంటాయి. యాత్రికులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రశాంతంగా పుణ్యక్షేత్రాల సందర్శన పూర్తి చేసుకోవచ్చు.
బడ్జెట్కు అనుగుణంగా ప్రయాణికులు ఎంపిక చేసుకునేందుకు మూడు రకాల కేటగిరీలను IRCTC అందుబాటులో ఉంచింది. ఎకానమీ స్లీపర్ క్లాస్ లో ఒక్కో వ్యక్తికి రూ.23,560 నుంచి ఛార్జీలు ప్రారంభమవుతాయి. స్టాండర్డ్ 3AC కేటగిరీలో ప్రయాణించాలనుకునేవారికి రూ.39,100 నుంచి ధరలు ఉన్నాయి. మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారికి 2AC కంఫర్ట్ కేటగిరీ అందుబాటులో ఉంది. ఈ విభాగంలో ఒక్కో వ్యక్తికి రూ.51,760 నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయి. పిల్లల కోసం ప్రత్యేక రాయితీ ధరలు కూడా అమలు చేస్తున్నారు. మొత్తం రైలులో 719 బెర్త్ లు అందుబాటులో ఉండగా, వాటిలో 460 ఎకానమీ, 210 స్టాండర్డ్, 49 కంఫర్ట్ బెర్త్ లు ఉన్నాయి. సీట్లు పరిమితంగా ఉండటంతో ఆసక్తి ఉన్న భక్తులు ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
దక్షిణ భారతంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే వారికి ఈ IRCTC టూర్ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రయాణం, వసతి, భోజనం వంటి అన్ని ఏర్పాట్లను సంస్థే చూసుకోవడం వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునే వీలుంటుంది.
Read Also: స్వదేశీ బుల్లెట్ రైలు వస్తోంది.. 2027లో పరుగులు.. స్పీడ్ ఎంతో తెలుసా?