Beautiful Hill Stations Near Hyderabad: జూన్ నెల దగ్గరపడుతుండటంతో వేసవి సెలవులు కూడా ముగిసే సమయం దగ్గరపడింది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, చాలా కుటుంబాలు షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండేవారికి చల్లని వాతావరణం ఉన్న హిల్ స్టేషన్లకు వెళ్లి రిలీఫ్ పొందాలని భావిస్తున్నాయి. అయితే ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలు ఈ సీజన్లో ఎక్కువగా రద్దీగా ఉంటాయి. అందుకే తక్కువ ఖర్చుతో, ప్రశాంతంగా గడపడానికి సౌత్ ఇండియాలో ఉన్న కొన్ని అందమైన హిల్ స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తక్కువ ఖర్చులో ప్రకృతి అందాలు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఈ హిల్ స్టేషన్లు బాగా నచ్చుతాయి.
ఏపీలోని అరకు లోయ.. హైదరాబాద్ నుంచి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరకు వెళ్లే రైలు ప్రయాణం ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. మార్గమధ్యలో కనిపించే కొండలు, సొరంగాలు, పచ్చని అడవులు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. అక్కడికి వెళ్లిన తర్వాత బొర్రా గుహలు, కటికి జలపాతం, ట్రైబల్ మ్యూజియంను చూడవచ్చు. కాఫీ తోటల మధ్య గడపడం మంచి ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది.
కర్నాటకలోని కూర్గ్ కూడా మరో అద్భుతమైన హిల్ స్టేషన్. ఇది హైదరాబాద్ నుంచి సుమారు 820 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాఫీ తోటలు, పొగమంచుతో కప్పబడిన కొండలు, అడవులు కూర్గ్ ప్రత్యేకత. ఇక్కడ కొన్ని ప్రాంతాలు పర్యాటకులతో బిజీగా ఉన్నా, ప్రశాంతంగా ఉండే హోమ్ స్టేలు కూడా చాలానే ఉంటాయి. కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి ఇదో మంచి ప్రదేశం. అబ్బే జలపాతం, రాజా సీట్ లాంటి ప్రదేశాలను అస్సలు మిస్ కాకూడదు.
తమిళనాడులోని కోటగిరి కూడా మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది ఊటీకి దగ్గరలో ఉన్నప్పటికీ, అంతగా రద్దీ ఉండదు. హైదరాబాద్ నుంచి దాదాపు 870 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. తేయాకు తోటలు, యూకలిప్టస్ చెట్లు, చల్లని గాలి ఆకట్టుకుంటాయి. కోడనాడు వ్యూ పాయింట్, కేథరీన్ జలపాతం లాంటి ప్రదేశాలు ప్రకృతి ప్రేమికులను బాగా ఆకట్టుకుంటాయి.
వాగమన్ కూడా ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్ లకు మంచి ఆప్షన్ గా మారుతోంది. హైదరాబాద్ నుంచి దాదాపు 1,150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం పచ్చిక బయళ్లు, పైన్ అడవులు, చల్లని వాతావరణం ఆకట్టుకుంటాయి. బోటింగ్, ప్రకృతి మధ్య వాకింగ్ ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లలతో కలిసి వెళ్లేవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది.
యలగిరి కూడా అందమైన హిల్ స్టేషన్. తమిళనాడులో ఉన్న ఈ ప్రదేశం హైదరాబాద్ నుంచి సుమారు 690 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రశాంతమైన సరస్సులు, ట్రెక్కింగ్ మార్గాలు, చల్లని వాతావరణం ఆకట్టుకుంటాయి. పుంగనూర్ సరస్సులో బోటింగ్, స్వామిమలై కొండల్లో ట్రెక్కింగ్ లాంటి కార్యకలాపాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
Read Also: పచ్చని కొండలు, జాలువారే జలపాతాలు.. మాన్సూన్ ట్రిప్స్ కు బెస్ట్ ప్లేసెస్ ఇవే!