Kakinada-Mysuru Train Service Starts: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాకినాడ నుంచి కొత్త రైల్వే సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా కాకినాడ– మైసూర్ మధ్య నేరుగా నడిచే రైలు సర్వీసును తాజాగా ప్రారంభించింది. ఈ రైలుకు 17289 అనే నంబర్ను కేటాయించారు అధికారులు. ఈ రైలును కాకినాడ లోక్సభ సభ్యుడు టి. ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రైలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరుతుంది. రాజమండ్రి, తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ లాంటి ముఖ్య నగరాల మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూరు చేరుకుంటుంది. దీని ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభమైంది.
ఈ రైలు సర్వీసు ప్రారంభంతో కాకినాడ, పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. మైసూరుకు నేరుగా వెళ్లే సౌకర్యం లేకపోవడం వల్ల ఇంత వరకు ప్రయాణికులు మధ్యలో రైళ్లు మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే రైలులో సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవారితో పాటు యాత్రికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అటు ఈ రైలు సర్వీసు ప్రారంభం సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కేంద్రం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ రైలు సర్వీసు వాణిజ్య, విద్య, పర్యాటక రంగాలకు మేలు చేస్తుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్నారు. ఈ రైలు మంజూరు కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు పలుమార్లు వినతి పత్రాలు అందించినట్లు చెప్పారు. ఈ సర్వీసును ఆమోదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక గోదావరి జిల్లా రైల్వే ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. తమ అభ్యర్థనకు త్వరగా స్పందించి ఈ రైలును ప్రారంభించినందుకు ఎంపీతో పాటు రైల్వే అధికారులకు సంఘం అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి డి.ఎన్. రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కొత్త రైలు సర్వీసు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, ఆర్థిక కార్యకలాపాలను కూడా పెంచే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!