Bata Shoes: స్కూల్ డేస్లో తొడుక్కున్న తెల్లటి కాన్వాస్ షూస్, నాన్న ఆఫీస్కి వేసుకెళ్లే లెదర్ షూస్, ఇంట్లో అమ్మ కాళ్లకు ఉన్న హవాయి చెప్పులు.. మన చిన్నతనం నుంచి చూస్తే చెప్పులన్నా, షూలన్నా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు ‘బాటా’. ఈ బ్రాండ్ పేరు మన చిన్నప్పటి జ్ఞాపకాలతో ఎంతలా కలిసిపోయిందంటే.. దీన్ని అందరూ మన స్వదేశీ కంపెనీయే అనుకుంటారు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బాటా అస్సలు మన దేశీయ బ్రాండ్ కాదు. మన ఇంట్లో మనిషిలా మారిపోయిన ఈ బ్రాండ్ వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు.
బాటా మన దేశంలో పుట్టలేదు. 1894లో అప్పటి ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యంలోని ‘జ్లిన్’ (ప్రస్తుత చెక్ రిపబ్లిక్) అనే చిన్న గ్రామంలో ప్రారంభమైంది. తోమాస్ బాటా, ఆయన సోదరుడు ఆంటోనిన్, సోదరి అన్నా కలిసి ఈ ఫ్యాక్టరీని పెట్టారు. వారి కుటుంబం తరతరాలుగా చెప్పులు కుట్టే పని చేసేది. అదే అనుభవంతో ఒక చిన్న వర్క్షాప్గా మొదలైన బాటా.. అనతికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద పాదరక్షల కంపెనీగా ఎదిగింది.
1930ల ప్రారంభంలో బాటా భారత్లోకి అడుగుపెట్టింది. 1931లో కలకత్తా సమీపంలో షూ విడిభాగాలను అసెంబుల్ చేయడం ప్రారంభించి, 1936 నాటికి ఏకంగా ఒక భారీ ఫ్యాక్టరీని, కార్మికుల కోసం ఒక టౌన్షిప్ను నిర్మించింది. అదే ఈనాటి ‘బాటా నగర్’. భారతదేశంలో ఒక బ్రాండ్ పేరు మీద ఏకంగా ఒక ఊరే ఏర్పడటం బాటా వేసిన బలమైన ముద్రకు ప్రత్యక్ష నిదర్శనం.
Also Read: భారీగా పెరగనున్న Nothing Phone 4a ధర.. వేరియంట్ల వారీగా కొత్త రేట్లు ఇవే!
అప్పట్లో చెప్పులు లేదా షూలు అంటే కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం అనే భావన ఉండేది. దానిని బాటా పూర్తిగా మార్చేసింది. సామాన్యుడి బడ్జెట్కు తగినట్టుగా, బాగా మన్నిక ఉండేలా ఉత్పత్తులను తెచ్చింది. ముఖ్యంగా కాన్వెంట్, సర్కారీ బడుల్లో పిల్లలు వాడే తెల్లటి కాన్వాస్ పిటి షూస్, నల్లటి స్కూల్ షూస్తో బాటా ప్రతి ఇంట్లోకి చేరింది. చిన్నతనం నుంచే ఈ బ్రాండ్తో పెరగడం వల్ల ఇది మన స్వదేశీ కంపెనీయే అనే భావన అందరిలోనూ బలంగా నాటుకుపోయింది.
వస్తువు ధర చివర రూ.9 ఉంచే సైకాలజీ (ఉదా: రూ.99, రూ.199, రూ.499) ప్రైసింగ్ టెక్నిక్ను భారత్కు పరిచయం చేసింది బాటానే. రూపాయి తక్కువగా చూపిస్తూ వినియోగదారులకు తక్కువ ధర అనే అనుభూతిని కలిగించే ఈ మార్కెటింగ్ వ్యూహం భారత్లో విపరీతంగా వర్కౌట్ అయింది.
బాటా కేవలం విదేశాల నుండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుని అమ్మలేదు. భారతదేశంలోనే ఫ్యాక్టరీలు పెట్టి, స్థానిక డిజైన్లతో, పూర్తి భారతీయ కార్మికులతోనే పాదరక్షలను తయారు చేయించింది. వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా.. మన దేశీ పండుగలు, వివాహాలకు తగ్గట్టుగా ‘హవాయి చెప్పులు’ వంటి ఉత్పత్తులను తెచ్చి స్థానిక బ్రాండ్గా కలిసిపోయింది.
ప్రస్తుతం స్విట్జర్లాండ్లోని లాసాన్ వేదికగా గ్లోబల్ కార్యకలాపాలు సాగిస్తున్న బాటాకు, భారత్ అనేది అత్యంత కీలకమైన, అతిపెద్ద మార్కెట్. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో లిస్ట్ అయిన అతిపెద్ద కంపెనీలలో ‘బాటా ఇండియా’ ఒకటి. దేశంలో వందల కొద్దీ బ్రాండ్లు వచ్చినా.. భారతీయులకు నమ్మకమైన పాదరక్షలు అనగానే ఇప్పటికీ గుర్తొచ్చే మొదటి పేరు బాటానే.
Also Read: యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్లోకి.. Android 17 కొత్త ట్రిక్ ఇదే!